బిఆర్ఎస్ సమావేశంలో రచ్చ రచ్చ

బిఆర్ఎస్ సమావేశంలో రచ్చ రచ్చ
  • గంగులకు చుక్కలు చూపించిన ఉద్యమకారుడు శ్యామ్
  • చెంచా గాళ్ళకు పదవులు ఇచ్చారంటూ ఆగ్రహం
  • బిఆర్ఎస్ కార్యకర్తల్లో కట్టలు తెంచుకున్న ఆగ్రహం
  • ఎంపీ ఎన్నికల సన్నాహాక సమావేశం రసాభాస

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశం రచ్చ రచ్చ అయింది.

ఎంపీ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న సమావేశంలో కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చెంచా గాళ్ళకే పదవులు ఇచ్చారంటూ తమ నైరాశ్యం వెళ్లగక్కారు. స్టేజ్ పైన మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ ఉన్నారు. ఈ క్రమంలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రసంగిస్తుండగానే కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో తమకు జరిగిన అన్యాయాన్ని కుండబద్దలు కొట్టారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఉద్యమకారులకు మాత్రం న్యాయం జరగలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. రసమయి ప్రసంగిస్తున్న క్రమంలో కిసాన్ నగర్ కు చెందిన కామారపు శ్యాం అనే ఉద్యమకారుడు, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు లేచి నాయకులను నిలదీశాడు. వేదికపైన ప్రముఖులు ఉన్న సమయంలోనే శ్యాం తన ఆవేదనను వెల్లగక్కిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఉద్యమం అప్పటి నుండి పనిచేస్తున్న తనపై కేసులు సైతం ఉన్నాయి. తన లాంటి వారికి అధికారంలో ఉన్నప్పుడు గుర్తింపే లేకుండా పోయిందన్నారు. ఇంతకాలం ఎవరెవరో వచ్చారని ఇప్పుడు ఎంపీ ఎన్నికల కోసం సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తల గురించి మాట్లాడుతున్నారంటూ శ్యాం నిలదీశాడు. ఎన్నికల సమయంలోనే కార్యకర్తలు గుర్తుకు వస్తారా అని నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనవసరపు హంగులు ఆర్భాటాలు చేయడం వల్లే పార్టీ ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ కలుగజేసుకొని ఎంటీ న్యూసెన్స్ అంటూ కూర్చొవాలని చెప్పినా వినకుండా శ్యాం తన ఆవేదన ను వెల్లగక్కేందుకే మొగ్గు చూపారు. దీంతో కామారపు శ్యామ్ కు మద్దతుగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయన్ని సముదాయించేందుకు కొంతమంది నాయకులు ప్రయత్నించినా వినకుండా నాయకుల వైఖరిని ఎండగట్టారు. గత ఎన్నికల్లో పనిచేసేందుకు తాను ముందుకు వచ్చినా బాధ్యతలు అప్పగించే వారే లేకుండా పోయారని, కేవలం కార్పొరేటర్లకే బాధ్యతలు అప్పగిస్తే విజయం ఎట్లా వరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని శ్యామ్ మండిపడ్డారు.

ఓ వైపున శ్యామ్ తన ఆవేదనను వెల్లగక్కుతున్న క్రమంలోనే మరో సీనియర్ కార్యకర్త లేచి తాను గంగుల కమలాకర్ టికెట్ కోసం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాని అయినా తనను పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ సీనియర్ కార్యకర్తలు సమావేశంలోనే తమ ఆవేదన వెలిబుచ్చిన తీరుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి వచ్చిన తరువాత తమలాంటి సామాన్యులను పట్టించుకోలేదని, తమ బాగోగులు కూడా పట్టించుకున్న పాపన పోలేదన్న రీతిలో బీఆర్ఎస్ సీనియర్ క్యాడర్ నిరసన వ్యక్తం చేసింది. దీంతో పార్టీ మీటింగ్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది.