ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొంటుంది: మంత్రి సత్యవతి రాథోడ్
కేసముద్రం, ముద్ర: యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వమే కొంటుందని, రైతులు ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యాన్ని సేకరించాలని, తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తామని, రైతులు ఆదోళన చెందవద్దని మంత్రి సత్యవతి రాథోడ్ భరోసా కల్పించారు.