ముంబైలోని సల్మాన్ఖాన్ నివాసం వద్ద కాల్పులు
సల్మాన్ఖాన్కు ఫోన్ చేసిన సీఎం ఏక్ నాథ్ షిండే
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల ఆదివారం ఉదయం కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. దీనిపై సల్మాన్ఖాన్కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం ముంబై పోలీస్ కమిషనర్తో షిండే మాట్లాడి ఖాన్కు భద్రత పెంచాలని సీఎం ఆదేశించారు.
బాంద్రా ప్రాంతంలోని గాలక్సీ అపార్ట్మెంట్స్ వెలుపల మోటార్ బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఉదయం 5 గంటల ప్రాంతంలో కాల్పుల కలకలం సృష్టించారు. నాలుగు రౌండ్లు వీరు కాల్పులు జరిపినట్టు అధికారులు చెబుతున్నారు. ఇదే అపార్ట్మెంట్లో సల్మాన్ ఖాన్ ఉంటున్నారు. దుండగులు కాల్పులు జరిపిన వెంటనే అక్కడ్నించి పరారయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సల్మాన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు.