కేరళలో ర్యాట్​ఫీవర్​

కేరళలో ర్యాట్​ఫీవర్​

న్యూఢిల్లీ: కేరళలో మరో కొత్త ఫీవర్‌ బెంబేలెత్తిస్తోంది. ఎర్నాకుళం నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరికి ర్యాట్ ఫీవర్ సోకినట్లు శనివారం నిర్ధారణ అయ్యింది. దీంతో ఆరోగ్య శాఖ అలర్టయ్యింది. అతిరపల్లిలోని సిల్వర్‌ స్టార్మ్‌ వాటర్‌ థీమ్‌ పార్క్‌ను సందర్శించిన విద్యార్థులకు ర్యాట్‌ఫీవర్‌ సోకడంతో వాటర్‌ థీమ్‌ పార్క్‌ను మూసివేయాలని అధికారులు సూచించారు. ర్యాట్​ఫీవర్​ను ముందుగానే గమనించి చికిత్స చేయకపోతే పరిస్థితులు మరణానికి దారి తీయొచ్చని వైద్యులు హెచ్చరించారు. ఎలుక మూత్రంతో కలుషిత నీరు కూడా వ్యాధిని కలిగిస్తుంది. స్నానం చేసే నీటిలో ఎలుకల మూత్రం కలుషితమైతే అవి కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఎలుకల మూత్రంతో కలుషితమైన నీటి ద్వారా కూడా బ్యాక్టీరియా పెంపుడు జంతువుల శరీరంలోకి ప్రవేశిస్తుంది. 

ర్యాట్‌ ఫీవర్‌ లక్షణాలు
అకస్మాత్తుగా విపరీతమైన జ్వరం, కొన్నిసార్లు జ్వరంతో చలి వస్తుంది. తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, మోకాళ్ల కింద నొప్పి, వెన్నునొప్పి, కళ్లు ఎర్రబడడం, కామెర్లు, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం, మూత్రం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్ర జ్వరంతో పాటు కామెర్లు ఉంటే, ర్యాట్‌ ఫీవర్‌గా అనుమానించాలి. పచ్చకామెర్లు కూడా ఆకలి లేకపోవడం, వికారం, వాంతులు కలిగి ఉంటాయి. కొందరికి పొత్తికడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, చర్మంపై ఎర్రటి మచ్చలు కనిపించవచ్చు.