తెలంగాణ సిరుల గని సింగరేణిని వేలం వేస్తే ఉద్యమమే

తెలంగాణ సిరుల గని సింగరేణిని వేలం వేస్తే ఉద్యమమే
  • రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణకు సింగరేణి ఒక ఆర్థిక, సామాజిక జీవనాడిలాంటిదని, కేంద్రం బొగ్గు గనులను ప్రైవేటీకరణ కుట్రలకు తెర లేపిందని, ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్‌ 3, శ్రావణ్‌పల్లి, పెనగడప గనులకు మరోసారి వేలంకు నోటిఫికేషన్ వేసిందని అయా ప్రక్రియలను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో మహోద్యమం చేపడతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  హెచ్చరించారు. బిఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో  బిఆర్ఎస్, టీబీజీకేఎస్ అధ్వర్యంలో చేపట్టిన నిరసన, మహాధర్నాలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు సిరుల గని అయిన మన బొగ్గు గనులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ముఖ్యంగా బొగ్గు గనుల ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసుకుని, ప్రజల ప్రయోజనాలు, వ్యవసాయం కోసం రైతులకు ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. దాదాపు 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి ఎన్నో లక్షల మందికి ఉపాధిని కల్పించిందని, రోడ్లు, విద్యాలయాలు, ఆసుపత్రులు ఏర్పాటు చేసి మనకు అశ్రమాన్ని కల్పించిందన్నారు. నేడు కేంద్రం అనాలోచిత నిర్ణయం వల్ల సింగరేణిని మనకు దూరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది అని కేంద్ర ప్రభుత్వం పై ధ్వజమెత్తారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే రాష్ట్రం చీకటిమయం అవుతుందని, బొగ్గు గనుల్లో వచ్చే లాభాలను పంచే సంస్థ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాల్లో రిజర్వేషన్లు, బోనస్‌లు, అలవెన్సులు ఇతర సంక్షేమ కార్యక్రమాలు రద్దవుతయన్నారు. సింగరేణి ఉద్యోగులకు అత్యధిక బోనస్ ఇచ్చిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో మిగిలిపోయాడని, ఇది సహించలేని కేంద్రం దాని అంతమొందించాలని కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది అని విమర్శించారు.

ముఖ్యమంత్రి కేసీఅర్ శ్రీ రామ రక్షగా ఉన్నాడు కాబట్టే ఇప్పటిదాకా సింగరేణి ఇంకా మిగిలి ఉందని లేకపోతే దాన్ని ఇప్పటికే కార్పొరేట్ లకు దరాదత్తం చేసి ఉండేవారని పేర్కొన్నారు. సింగరేణి నీ ప్రైవేటీరణ చేయమని చెప్పి మళ్ళీ గనులకు వేలంకు పెట్టడం సిగ్గుచేటు అన్నారు. సింగరేణి ఏ విధంగా ప్రైవేటు పరం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.ప్రతి ఏడాది లాభాలలో ఉన్న సింగరేణిని లాభాల బాట పట్టకుండా కుట్రలతోనే సమర్థవంతమైన అధికారులను తప్పించేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.సింగరేణి సంస్థను నష్టాల్లోకి  పంపాలనేది కేంద్ర ప్రభుత్వం ముఖ్యఉద్దేశం అని అన్నారు.. సింగరేణి తెలంగాణ ప్రజల హక్కు  ఇది ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. వందే భారత్ రైళ్ళను ఇప్పటికే 10సార్లకు పైగా ప్రధాని మోడీ ప్రారంభించారని, ఒకే రైలును ఎన్ని సార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు.
సింగరేణి వేలం విషయంపై కేంద్రం వెనకి తగ్గకుంటే జంగ్‌ సైరన్‌ మోగిస్తామని, బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఅర్ , రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్  నేతృత్వంలో మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు  వనమా వెంకటేశ్వరరావు, కేంద్రాలు ఉపేందర్ రెడ్డి ,సండ్ర వెంకట వీరయ్య , మెచ్చనాగేశ్వరరావు, హరిప్రియ, రాములు నాయక్, ఎమ్మెల్సీలు తాత మధు , వద్దిరాజు రవిచంద్ర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు