సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య

సెల్ఫీ వీడియో తీసుకుని వ్యక్తి ఆత్మహత్య

కేసముద్రం, ముద్ర: మరణించడానికి ముందు ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అన్నారం గ్రామ శివారు వెంక్యా తండాలో బుధవారం రాత్రి జరిగింది. కేసముద్రం ఎస్సై తిరుపతి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

వెంక్యా తండాకు చెందిన భానోత్ అశోక్ (24) తో మహబూబాబాద్ జిల్లా శనగపురం శివారు తండాకు చెందిన యువతితో ఏడాది క్రితం వివాహం జరిగింది. అశోక్ భార్య గర్భవతి కావడంతో ప్రసూతి కోసం ఇటీవల తల్లిగారింటికి వెళ్లింది. కుమారుడికి జన్మనిచ్చిన తర్వాత అశోక్ తన భార్యను కొడుకును పుట్టింటికి తీసుకురావడానికి ఇటీవల అత్తారింటికి వెళ్లాడు. అయితే భార్య, అత్త, మామ, తోడల్లుడు, ఇతర బంధువులు కలిసి నీ ఆస్తి మొత్తం పుట్టిన కొడుకు పై రాసి ఇవ్వాలని, అలాగే నీవు కూడా అత్తారింట్లో ఉండాలని అప్పుడే సంసారం చేస్తుందని చెప్పారన్నారు.

ఈ విషయంపై అప్పట్లో పంచాయతీ నిర్వహించిన ఫలితం లేకుండా పోయింది. గత మంగళవారం మళ్లీ అశోక్ తన కొడుకును భార్యను చూడడానికి శనగపురంకు వెళ్ళగా భార్య బంధువులు భార్య, కొడుకును చూపడానికి నిరాకరించడంతోపాటు నీవు బతికుండి వృధా అంటూ హేళన చేశారన్నారు. దీనితో మనస్థాపానికి గురైన అశోక్ ఈనెల 26న మధ్యాహ్నం వెంక్యా తండాలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు.

ఈ క్రమంలో తనకు కలిగిన ఇబ్బందులను సెల్ఫీ వీడియో ద్వారా చిత్రీకరించాడు. పురుగుల మందు తాగి అపస్మానిక స్థితిలో ఉన్న అశోక్ ను అదే రోజు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించగా పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి వరంగల్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడన్నారు. తన కుమారుడి మృతికి కోడలి తోపాటు అత్త, మామ ఇతర బంధువుల వేధింపులే కారణమని మృతుని తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. మృతుడు అశోక్ మరణానికి ముందు సెల్ఫీ వీడియో తీసుకోవడం తీవ్ర సంచలనం సృష్టిస్తుంది.