పదివేల కోసం అక్కాచెల్లెళ్ల కాల్చివేత

పదివేల కోసం అక్కాచెల్లెళ్ల కాల్చివేత
  • దేశ రాజధాని ఢిల్లీలో దారుణం
  • శాంతిభద్రతలు దిగజారాయన్న సీఎం కేజ్రీవాల్

న్యూఢిల్లీ: తాము ఇచ్చిన పది వేల రూపాయల అప్పు తీర్చమని అడిగినందుకు ఇద్దరు సోదరీమణులను కొందరు దుండగులు కాల్చి చంపారు.  నైరుతి ఢిల్లీలోని ఆర్‌కే పురం అంబేద్కర్ బస్తీలో ఈ సంఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పింకీ (30), జ్యోతి (29) అక్కాచెల్లెళ్లు తమ సోదరుడు లలిత్ తో కలిసి ఆ బస్తీలో నివాసముంటున్నారు. దాదాపు 15–20 మంది సాయుధులు ముందుగా వారింటి తలుపులు తట్టారు.

తలుపులు తెరువకపోవడంతో ఇటుకలు, రాళ్లు రువ్వారు. తర్వాత కూడా ఎవరూ తలుపులు తెరవకపోవడంతో వారు అక్కడ నుంచి  వెళ్లిపోయారు. అనంతరం లలిత్ తన ఇద్దరు సోదరీమణులతో కలిసి బయటకు వచ్చి దాడి చేసిన వారి గురించి ఆరా తీస్తుండగా, దుండగులు అకస్మాత్తుగా తిరిగి వచ్చి కాల్పులు జరిపారు. దీంతో పింకీ, జ్యోతికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఒక బుల్లెట్ లలిత్‌ను కూడా తగిలింది. ఈ ముగ్గురినీ వెంటనే ఎస్జే ఆసుపత్రికి తరలించారు. పింకీ, జ్యోతి చికిత్స పొందుతూ మరణించారు. డబ్బుల విషయంలో స్థానికంగా ఉండే దేవ్ అనే వ్యక్తితో గొడవలు ఉన్నాయని లలిత్ పోలీసులకు చెప్పాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు నిందితులు అర్జున్, మైఖేల్, దేవ్‌ను అరెస్ట్ చేశారు. మిగతావారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.