మన హీరోలకు నార్త్లోచోటెక్కడ?
మన టాలీవుడ్ హీరోలకి బాలీవుడ్ మార్కెట్ మీద పట్టు సాధించాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారు అనుకున్న క్రేజ్ మాత్రం దక్కడం లేదనే చెప్పాలి. ఇక అక్కడ వరుసగా సినిమాలు చేసే అవకాశాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవి హిందీ సినిమాలు చేయాలనుకున్నారు. కానీ వరుసగా మాత్రం చేయలేకపోయారు. నాగార్జున కూడా హిందీ జనాలకి బాగానే సుపరిచితుడు. కానీ హిందీ సినిమాలలో నటించాలంటే సాధ్యపడలేదు. అక్కడ స్ట్రైట్ సినిమాలు చేయాలనుకున్న మన టాలీవుడ్ హీరోలకి బాలీవుడ్ అంతగా కలిసి రావడం లేదు.
ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమా అంటూ బహుభాషా చిత్రాలను నిర్మిస్తున్నారు. సౌత్ కంటే నార్త్లోని హింది ఇండస్ట్రీకే మార్కెట్ ఎక్కువ. అందుకే హిందీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంటాయి. కానీ మన సౌత్ సినిమాలు మాత్రం ఆయా భాషాలలో బెల్ట్ బెల్ట్ విడుదలవుతూ మిగతా భాషలలో డబ్ చేస్తున్నారు. హిందీలో కూడా మన హీరోలు నటించిన సినిమా డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ భారీ యాక్షన్ ఎంటర్టైనర్స్ గా వచ్చినవి అక్కడ డబ్ చేసి వదులుతున్నారు. హిందీలో ఎక్కువ ఫైట్స్ ఉన్న సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు.
రామ్చరణ్ తన కెరీర్ మొదట్లోనే ఎంతో ఇష్టపడి చేసిన జంజీర్ వ్యతిరేక రిజల్ట్ ఇవ్వడంతో మళ్లీ ఆ దిశగా ప్రయత్నం చేయలేదు. అయితే ఆర్ ఆర్ ఆర్ ఇచ్చిన క్రేజ్తో చెర్రీకి మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక మహేష్బాబు ఇంతవరకూ బాలీవుడ్లో డైరెక్ట్గా అడుగుపెట్టలేదు. కాకపోతే కొన్ని నేషనల్ యాడ్స్ ద్వారా బాలీవుడ్కు సుపరిచితుడు. త్వరలో వచ్చే రాజమౌళి సినిమాతో హిందీ మార్కెట్లో అడుగుపెట్టే ఛాన్స్ కనిపిస్తోంది. అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్ కూడా హిందీ మార్కెట్పై కన్నేశారు. అయితే వాళ్లని అక్కడ పార్ట్ టైమ్ నటులుగానే గుర్తించారే తప్ప నార్త్ లో డామినేట్ హీరోగా వాళ్లు ఒప్పుకోలేదు. ఇటీవల వచ్చిన బాహుబలి, పుష్ప సినిమాలతో మళ్లీ తెలుగు హీరోల దృష్టి బాలీవుడ్పై పడింది. అందుకే ప్రభాస్, రాం చరణ్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన యాక్షన్ సినిమాలను హిందీ వర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు. డబ్బింగ్ వర్షన్ కి బాగానే అట్రాక్ట్ అవుతున్నారు. కానీ బాలీవుడ్లో స్ట్రైట్ సినిమా అంటే మాత్రం అంతగా ధైర్యం చేసి అడుగు వేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్.టి.ఆర్, మంచు ఫ్యామిలీ హీరోలు హిందీలో స్ట్రైట్ సినిమా చేయాలనే ఆసక్తి చూపించలేదు. కానీ నాగార్జున మాత్రం హిందీలో నటించడానికి ముందు నుంచి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
రీసెంట్గా బాలీవుడ్లో తెరకెక్కిన మల్టీస్టారర్ బ్రహ్మాస్త్ర లో కీలక పాత్ర పోషించారు. ఆయన తనయుడు టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య కూడా ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటిసారి అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టి అనూహ్య విజయం సాధించారు. బాహుబలికి ముందు ప్రభాస్ సినిమాలు కూడా హిందీలో డబ్బింగ్ వర్షన్ మాత్రమే రిలీజయ్యాయి. అయితే బాహుబలి సినిమా తర్వాత బాలీవుడ్ బెల్ట్లో ప్రభాస్కి విపరీతమైన క్రేజ్ పెరిగింది. దాంతో సాహో సినిమా అన్ని భాషలలో నిరాశ పరచినా హిందీలో మాత్రం 150 కోట్ల వసూళ్ళు రాబట్టడం ఆసక్తికరం. అందుకే ఆదిపురుష్ అనే సినిమాతో ప్రభాస్ బాలీవుడ్లో స్ట్రైట్ సినిమా చేస్తున్నాడు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా బాలీవుడ్లో ఛత్రపతి హిందీ రీమేక్తో అడుగు పెట్టాడు. ఆ సినిమాకు అక్కడ అనుకున్న ఫోకస్ రాలేదు. మూవీ టాక్ కూడా మిశ్రమంగా వచ్చింది.
బెల్లంకొండ శ్రీనివాస్కి టాలీవుడ్లో ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ఒక్క రాక్షసుడు తప్ప మిగతావన్ని ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి. హిందీలో నటించిన తొలి చిత్రం ఊహించినంత టాక్ రాలేదు. బాలీవుడ్లో ఆఫర్లు మాత్రం ఉన్నాయి. తర్వాత సినిమాలతో ఎంతవరకు నెట్టుకొస్తాడో చూడాలి. నాని, శర్వానంద్ లాంటి వాళ్ళ సినిమాలు హిందీలో డబ్ వర్షన్ మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్, పుష్ప తర్వాత అల్లు అర్జున్, ఛత్రపతి రీమేక్ తర్వాత బెల్లంకొండ హీరో ఏ మేరకు నెట్టుకొస్తారో చూడాలి.