పుట్టపర్తిలో ఉద్రిక్తత.. పల్లె రఘునాథ రెడ్డి కారు ధ్వంసం

పుట్టపర్తిలో ఉద్రిక్తత.. పల్లె రఘునాథ రెడ్డి కారు ధ్వంసం

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి హనుమాన్‌ జంక్షన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుట్టపర్తి అభివృద్ధిపై  టీడీపీ  నేత పల్లె రఘునాథరెడ్డి, వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి పరస్పర సవాళ్లతో ఆ ప్రాంతంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.  ఇటీవల నారా లోకేశ్‌ పాదయాత్ర పుట్టపర్తిలో జరిగింది. ఈ సమయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిని, లోకేశ్‌ను విమర్శిస్తూ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. దీనిపై టీడీపీ  వర్గాలు తీవ్రంగా స్పందించాయి. పుట్టపర్తి అభివృద్ధి ఏ మేరకు చేశారో చర్చకు రావాలని పల్లె రఘునాథరెడ్డి.. వైకాపా ఎమ్మెల్యేకు సవాలు విసిరారు. స్థానిక సత్తెమ్మ ఆలయం వద్ద చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వేదిక ఏర్పాటు కోసం పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి  టీడీపీ  కార్యాలయానికి వచ్చారు. దీంతో పోలీసులు ఆయన్ని  టీడీపీ  కార్యాలయంలోనే నిర్బంధించారు. మరోవైపు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో గృహనిర్బంధం చేశారు.  అయితే  టీడీపీ  కార్యాలయం గోడ దూకి పల్లె రఘునాథరెడ్డి హనుమాన్‌ జంక్షన్‌కు వెళ్లారు. అక్కడ ఇరు పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ , వైకాపా కార్యకర్తలు పరస్పరం చెప్పులు విసురుకున్నారు. పల్లె రఘునాథరెడ్డి కారును వైకాపా కార్యకర్తలు ధ్వంసం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. పల్లె రఘునాథరెడ్డిని అరెస్టు చేశారు.