ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని.. తల్లిదండ్రులను చెరువులో తోసేసి.. కన్న కొడుకు దారుణం

ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని.. తల్లిదండ్రులను చెరువులో తోసేసి.. కన్న కొడుకు దారుణం

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి : ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో ముసలివారైన తల్లిదండ్రులను చెరువులో తోసి హత్యాయత్నానికి పాల్పడిన తనయుడి ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగింది. పట్టణంలోని విద్యానగర్ కు  చెందిన రేష్మ బేగం, సలీమ్ దంపతులకు ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూతుర్ల పెళ్ళి ళ్లు కాగా, కుమారుడు కలిమ్ కు రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది. అయితే కలిమ్ తాగుడుకు బానిస కావడం, ఏ పని చేయకుండా జులాయిగా తిరగడంతో భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తూ వచ్చిన కలిమ్,  శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకుందామని తల్లిదండ్రులను పట్టణ సమీపంలో ఉన్న పెద్ద చెరువుకు తీసుకెళ్లాడు. ముగ్గురూ చెరువులో దిగగా, వెనుక నుంచి కలిమ్ పథకం ప్రకారం తల్లిదండ్రులను బలవంతంగా తోసేశాడు. విషయం తెలుసుకున్న కలిమ్ బావ  చెరువుకు చేరుకొని అత్తా మామలను బయటకు తీసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే సలీమ్ (55)చనిపోగా, రేష్మ బేగం చికిత్స పొందుతున్నారు. రేష్మ బేగం,తన కొడుకు కలిమ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సిఐ నరేష్ తెలిపారు