ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్
ముద్ర ప్రతినిధి,కామారెడ్డి: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులను, వినతులను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ స్వీకరించారు.
అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు కలెక్టర్ సిఫారసు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. జిల్లా కేంద్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వస్తున్న ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను శాఖల వారీగా స్వీకరించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఎవో మసూర్ అహ్మద్, డి ఆర్ డి ఓ సాయన్న, కలెక్టరేట్ లోని వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.