రాయదుర్గం-ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణ కాంట్రాక్టుపై  13 కంపెనీల కన్ను

రాయదుర్గం-ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణ కాంట్రాక్టుపై  13 కంపెనీల కన్ను

రేస్ లో ఎల్అండ్‌టీ, ఆస్టోమ్, టాటా ప్రాజెక్ట్స్,  ఐఆర్‌సీవోఎన్ కంపెనీలు

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులకు సంబంధించిన టెండర్లు ఆహ్వానించడం, ప్రి బిడ్డింగ్ మీటింగ్‌ ప్రక్రియ ను మెట్రో అధికారులు పూర్తి చేసారు. జూలై 5న ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించగా, తాజాగా ప్రి బిడ్డింగ్ మీటింగ్‌ను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎయిర్‌పోర్ట్ మెట్రో ప్రాధాన్యత, ఎలాంటి సౌకర్యాలు ఉండాలనే విషయాలను మెట్రో అధికారులు బిడ్డర్లకు వివరించారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు నిర్మించనున్న 31 కిలోమీటర్ల పొడవైన ఈ మెట్రో కారిడార్‌కు రూ.5,688 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దీనికి సంబంధించిన పూర్తి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనున్నది.

ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్ నిర్మాణం పట్ల 13 కంపెనీలు ఆసక్తి చూపుతున్నారు. ఈ కంపెనీ లలో ఎల్అండ్‌టీ, ఆస్టోమ్, టాటా ప్రాజెక్ట్స్, రైల్వే శాఖకు చెందిన ఐఆర్‌సీవోఎన్, నవరత్న కంపెనీ ఆర్‌వీఎన్ఎల్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన బీఈఎంఎల్, పాండ్రోల్ రహీ టెక్నాలజీస్‌తో పాటు మరి కొన్ని కంపెనీలు ఈ ప్రీ బిడ్ సమావేశంలో పాల్గొన్నాయి. ఇప్పటికే 31 కిలోమీటర్ల మెట్రో కారిడార్ మార్గంలో ప్రిలిమినరీ పనులు పూర్తయ్యాయని బిడ్డర్ కంపెనీలకు మెట్రో అధికారులు వివరించారు. సర్వే, పెగ్ మార్కింగ్, అలైన్‌మెంట్ ఫిక్సింగ్ పూర్తయ్యిందని.. సాయిల్ టెస్ట్ కూడా వేగవంతంగా చేస్తున్నట్లు  వివరించారు.రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఈ మెట్రో మార్గంలో 1.7 కిలో మీటర్లు అండర్ గ్రౌండ్‌లో ఉంటుందని.. మిగిలిన 29.3 కిలోమీటర్లు ఎలివేటెడ్ మెట్రో కారిడార్ ఉంటుందని  మెట్రో అధికారులు వివరించారు. అలాగే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మినల్ 1 వద్ద అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నిర్మిస్తామని, సెప్టెంబర్ నెలలో ఎయిర్‌పోర్ట్ మెట్రో పనులు ప్రారంభించి మెట్రో అధికారులు భావిస్తున్నారు.