ప్రజా సొమ్ముతో వంద ఎయిర్ పోర్ట్ లను ఎవరికి కోసం నిర్మిస్తున్నారు

ప్రజా సొమ్ముతో వంద ఎయిర్ పోర్ట్ లను ఎవరికి కోసం నిర్మిస్తున్నారు

హిమాయత్ నగర్,ముద్ర: రైల్వేస్టేషన్లు, రైళ్లు ,పోర్టులను ప్రజా సొమ్ముతో అభివృద్ధి చేసిన తర్వాత, వాటిని తిరిగి కార్పొరేట్ శక్తులకు అమ్మెందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. ‘బిజెపి హటావో - దేశ్ బచావో ’ నినాదంతో ప్రజా క్షేత్రంలోనికి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, అప్రజస్వామిక విధానాలను ప్రజలకు తెలియజేస్తామని వెల్లడించారు.సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈనెల 14 నుండి మే 15 వరకు నిర్వహించే “బిజెపి హటావో - దేశ్ బచావో” పాదయాత్ర కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ.టి.నర్సింహ, హైదరాబాద్ జిల్లా కార్యదర్శి  ఎస్. ఛాయాదేవి,సహాయ కార్యదర్శులు కమతం యాదగిరి, బి. స్టాలిన్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశంలతో కలిసి హిమాయత్ నగర్, మగ్ధుంభవన్ లో సోమవారం ఆయన ఆవిష్కరించారు.  

ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ లాభాలను చూపించి, ప్రైవేటుపరం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైలును తీసుకొచ్చిందని విమర్శించారు. ఒక వైపు ఎయిర్ ఇండియాను ప్రైవేటు పరం చేసి, మరోవైపు ప్రజా సొమ్ముతో వంద ఎయిర్ పోర్ట్ లను ఎవరికి కోసం నిర్మిస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఎయిర్ పోర్ట్ లను కూడా కార్పొరేట్లకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రూ.15 లక్షల కోట్ల ఆస్తలు కలిగిన బి.ఎస్.ఎన్.ఎల్  సంస్థకు  కేవలం రూ.35 కోట్ల అప్పును కూడ కేంద్రం ఇవ్వలేదని విమర్శించారు. ప్రధాని పదవికి చదువుకు సంబంధం లేకపోయినా చదువుకున్న డిగ్రీ అంశంలో కూడా మోడీ అబద్దాలు చెబుతూ అనైతికతకంగా వ్యవహారిస్తూ ప్రధాని స్థాయిని దిగజార్చుకున్నారని మండిపడ్డారు. అదానీ బంగారు చిలుక అని, కూపీలాగితే మోడీ, అమిత్ షా లు బయటకు వస్తారని, అందుకే అదానీని ప్రధాని మోడీ రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.