నమ్మి ఓట్లేస్తే రైతులను ముంచుతురా ?

నమ్మి ఓట్లేస్తే రైతులను ముంచుతురా ?
  • రైతు భరోసా ఎకరాకు రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదు?
  • రూ.2 లక్షల రుణమాఫీ ఎప్పుడు అమలు చేస్తారు?
  • పంటలు ఎండిన రైతులకు సాయం చేయరా?
  • రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ను ఎండగట్టెందుకు ‘‘రైతు దీక్ష’’
  • రైతు దీక్షలో బండి సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ముంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. వంద రోజుల్లో రైతు భరోసా కింద రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు ఇస్తానన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించార రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని, పంట నష్టపోయిన రైతులకు పరిహారంలో జాప్యమెందుకని నిలదీశారు. కాంగ్రెస్ చేస్తున్న  మోసాలను ఎండగట్టడంతో రైతులకు భరోసా ఇచ్చేందుకే ‘రైతు దీక్ష’’ చేపట్టినట్లు చెప్పారు. ఈరోజు  కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో  రైతులతో కలిసి  బండి సంజయ్ ‘రైతు దీక్ష’ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి తదితరులతో కలిసి  బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన రైతులు మోసపోయారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చేతులెత్తేసింది.కోట్లాది రూపాయల ప్రకటనలతో 6 గ్యారంటీలను అమలు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు.రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదు?. రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదు?. వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ ఏమైందంటూ ప్రశ్నించారు.

వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనయ్ వెంటనే బోనస్ ప్రకటించండి. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు తీసుకురాలేదు?. అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందిన పంట నీళ్లపాలైంది. సాగునీరు లేక పంట ఎండిపోయి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే ఎకరాకు రూ.10 వేల సాయం ప్రకటించిన ప్రభుత్వం ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తోంది. రైతులు కష్టాల్లో ఉన్నారు. రూ.10 వేల సాయం సరిపోదు. తక్షణమే ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాల్సిందే అని డిమాండ్ చేశారు.