ఏడున్నర దశాబ్దాల తర్వాత భారత గడ్డపై చీతాల జననం

ఏడున్నర దశాబ్దాల తర్వాత భారత గడ్డపై చీతాల జననం

గతేడాది ఆఫ్రికా దేశం నమీబియా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒకటి ప్రసవించింది. ఈ చీతా పేరు సియా. ఇది నాలుగు చీతా పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్ లోని కునో జాతీయ అభయారణ్యంలో ఈ చీతాలు ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా భారత్ లో చీతాల జాడలేదు. దాంతో నమీబియా నుంచి 8 చీతాలను ప్రత్యేక విమానంలో భారత్ తీసుకురాగా, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వాటిని కునో నేషనల్ పార్క్ లో విడుదల చేశారు.  కాగా, సాషా అనే ఆడ చీతా ఇటీల కిడ్నీ వ్యాధితో మరణించింది.

అది మరణించిన కొన్నిరోజులకే సియా అనే చీతా 4 పిల్ల చీతాలకు జన్మనిచ్చింది.  1947లో ఇప్పటి చత్తీస్ గఢ్ లోని కోరియా జిల్లాలో చివరి చీతా మృత్యువాత పడింది. భారత్ లో ఇవి అంతరించిపోయిన జాతి అని 1952లో అధికారికంగా ప్రకటించారు. విచ్చలవిడి వేట, అటవీ విస్తీర్ణం తగ్గిపోవడం వంటి కారణాలతో చీతాలు భారత గడ్డపై కనిపించకుండాపోయాయని నిపుణులు చెబుతున్నారు.