గ్రూప్‌-1 లీకేజీ కేసులో ముగ్గురిని  విచారిస్తున్న సిట్

గ్రూప్‌-1 లీకేజీ కేసులో ముగ్గురిని  విచారిస్తున్న సిట్

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నాంపల్లి కోర్టు అనుమతితో షమీమ్, రమేశ్‌, సురేశ్‌లను సిట్ అధికారులు చంచల్ గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టారు. కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం హిమాయత్ నగర్‌లోని సిట్ కార్యాలయానికి నిందితులను తీసుకొచ్చారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో షమీమ్‌కు 126 మార్కులు, రమేశ్‌కు 122, సురేశ్‌కు 100కు పైగా మార్కులొచ్చాయి. రాజశేఖర్, ప్రవీణ్‌ల ద్వారా ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని ముగ్గురు నిందితులు తీసుకున్నట్లు సిట్ అధికారులు ఇప్పటికే తేల్చారు. ఈ ముగ్గురి ద్వారా ఇంకెవరికైనా ప్రశ్నపత్రం వెళ్లిందా? అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ముగ్గుర్నీ వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. నేటి నుంచి 5రోజుల పాటు ముగ్గురు నిందితులను సిట్ అధికారులు విచారించనున్నారు.

టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి ఎన్నిసార్లు వెళ్లారు?
గ్రూప్-1 ప్రిలిమ్స్ లో 100కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులనూ గత వారం రోజులుగా సిట్ కార్యాలయానికి అధికారులు పిలిచి వివరాలు సేకరిస్తున్నారు. 18అంశాలతో కూడిన పత్రాన్ని ఇచ్చి దాన్ని నింపి ఇవ్వాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ మేరకు అభ్యర్థులు ఆ పత్రాలను నింపి సిట్ అధికారులకు ఇచ్చి వెళ్తున్నారు. గతంలో ఎన్నిసార్లు టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్లారు? ఒకవేళ వెళ్తే అక్కడ ఎవరెవర్నీ కలిశారు? అభ్యర్థులు ఎక్కడ శిక్షణ తీసుకున్నారు? వారి చిరునామా, కుటుంబ వివరాలను సేకరిస్తున్నారు.