ఫేక్‌ రివ్యూస్‌కి చెక్‌ పెట్టిన బోయపాటి శ్రీను

ఫేక్‌ రివ్యూస్‌కి చెక్‌ పెట్టిన బోయపాటి శ్రీను

రామ్‌పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్‌లు హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘స్కంద’ సెప్టెంబర్‌ 28న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్‌ సినిమా విజయం తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌స్క్రీన్స్‌ పతాకంపై చిట్టూరి శ్రీనివాస్‌ నిర్మించారు. సెప్టెంబర్‌ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక పెద్ద బడ్జెట్‌ సినిమా విడుదలవుతుంది అంటే దానిపై అందరి కళ్లు ఉంటాయి. ముఖ్యంగా సినిమాకి సంబంధించిన మొదటి షో ఎక్కడ పడుతుందో అక్కడనుండి టాక్‌ స్ప్రెడ్‌ అవుతుంది. పెద్ద సినిమాలన్నింటికి దాదాపుగా అమెరికాలో తొలి షో పడుతుంది. మొదటగా ఓ సినిమాకి టాక్‌ అక్కడినుండి వస్తుండటంతో ఫేక్‌ రివ్యూలు ఎక్కువగా వస్తున్నాయి.

అందుకే సినిమాని విపరీతంగా ప్రేమించే బోయపాటి శ్రీను తాను దర్శకత్వం వహించిన ‘స్కంద’ సినిమాకి సంబంధించి ఓ కొత్త ప్రయోగానికి తెరలేపాడు. అదేంటంటే ఇండియాలో ఏ సమయానికి మొదటి షో పడుతుందో అదే సమయంలో అమెరికాతో పాటు మిగతా దేశాల్లో కూడా షోను ప్రదర్శించే విధంగా తన టీమ్‌తో కలిసి ప్లాన్‌ వేశాడు. ఇలా చేయటం వల్ల పని కట్టుకుని ఫేక్‌ రివ్యూలు రాసేవాళ్లకి చెక్‌ పెట్టినట్లే అవుతుంది.

అందుకే గురువారం ఉదయం పదిగంటల ముందు వచ్చే ఏ రివ్యూ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సినిమా టీమ్‌తో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను ఈ ప్లాన్‌ను అమలు చేస్తున్నారని సమాచారం. మొత్తానికి ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌ వేడుకలో విడుదలైన ట్రైలర్‌ తర్వాత ‘స్కంద’ సినిమాని చూసే తీరే మారిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలో రాజకీయంగా ఎటువంటి ఎలిమెంట్స్‌ ఉంటాయే అని ప్రతి ఒక్క సినిమా లవర్స్‌ ‘స్కంద’ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు.