పేద వాళ్ళ కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం కేసీఆర్
- ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలి
- ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి
- రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశుసంక్షేమశాఖలమంత్రి సత్యవతిరాథోడ్..
ముద్రప్రతినిధి, మహబూబాబాద్: అన్ని వర్గాల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ లో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయసమ్మేళనంలో ముఖ్యఅతిథిగా మంత్రి సత్యవతిరాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. నిరుపేద, బడుగు, బలహీన వర్గాల కోసం సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యలతో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. రైతు బంధు, రైతు బీమాతో పాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు వంటి అనేక పథకాలు అమలు చేసి దేశంలోనే గొప్ప వ్యక్తిగా సీఎం కేసీర్ పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు పాదయాత్రల పేరుతో గ్రామాలు తిరిగినా ప్రయోజనం లేదన్నారు. గిరిజన సంక్షేమానికి కేసీఆర్ గిరిజన రిజర్వేషన్ 6 నుండి 10శాతం పెంచారని, గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా చేసి, ఒక్కో నూతన గ్రామపంచాయతీ భవనానికి 20 లక్షల చొప్పున మంజూరు ఇచ్చారని అన్నారు. ఇవన్నీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ కి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని మంత్రి సత్యవతిరాథోడ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అద్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, మహబూబాబాద్ యంపి, భారాస జిల్లాఅద్యక్షురాలు మాలోత్ కవిత, మాజీఎమ్మెల్సీ పురాణం సతీష్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ ఛైర్మెన్ ఫరీద్, స్థానిక కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, యూత్ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.