కాంగ్రెస్ ను మహిళలు మర్చిపోవద్దు...

కాంగ్రెస్ ను మహిళలు మర్చిపోవద్దు...
  • అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి ,రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలులోకి..
  • పేదల కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి
  • చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ముద్రప్రతినిధి,చొప్పదండి: తెలంగాణ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని ముఖ్యంగా మహిళలకు ఎంతో ఉపయోగపడే మహాలక్ష్మి పథకాన్ని సమర్ధంగా అమలు చేస్తున్నామని మహిళలు కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ మర్చిపోవదని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈ మేరకు రామడుగు మండలం దేశరాజుపల్లి లో రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించి మాట్లాడారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశరాజ్ పల్లె గ్రామాన్ని దత్తత  తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్న మాట నిలబెట్టుకుంటానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గ్రామ ప్రజలకు భరోసా ఇచ్చారు.చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతి ఇంట్లో పెద్ద కొడుకులా, ప్రతి కుటుంబానికి అండగా ఉంటానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ను తప్పకుండా అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలను ప్రారంభించడం జరిగిందని మరో నాలుగు గ్యారంటీలను వంద రోజుల్లో ప్రభుత్వం ప్రారంభిస్తుందని స్పష్టం చేశారు. 24 గంటల విద్యుత్ రాదంటూ ప్రతిపక్షాలు చిల్లర రాజకీయం చేస్తున్నాయని ప్రజలు, రైతులు వారి మాటలను నమ్మవద్దన్నరు. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా 24 గంటల విద్యుత్ ను అందజేస్తుందని రైతులు ఆందోళన చెందొద్దని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యానికి రూ.2500 మద్దతు ధరను ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి  రాష్ట్రంలోని మహిళల కళ్ళలో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో మహిళల కోసం రాష్ట్రంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం సంతోషకరమన్నారు.అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించిన గొప్ప నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు.అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని అప్పుల పాలు కావద్దన్న ఉద్దేశంతో  రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి 10 లక్షల రూపాయలతో ఉచిత వైద్యం చేయించుకోననేలా కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని అందరూ సద్వినియోగపర్చుకోవాలని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఎలాంటి జబ్బుకైనా కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా ప్రభుత్వం  చర్యలు చేపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఎంపీపీ కలిగేటి కవిత, గ్రామ సర్పంచ్ కోల రమేష్, ఎంపీటీసీ సభ్యుడు వంచ మహేందర్, పిడి డిఆర్డిఎ శ్రీ లత, తహసీల్దార్ భాస్కర్, ఎంపిడిఓ భాస్కర్ రావు, అసిస్టెంట్ డిఎంహెచ్ఓ జుబెరియా బేగం, ఆర్టీసీ డిపో మేనేజర్, మండల  వైద్యాధికారి రమేష్, ఏఎన్ఎం  అసిస్టెంట్  ఏఎన్ఎంలు వివిధ గ్రామాల సర్పంచులు ,ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు.