ఎన్నికల ఫలితాల వేళ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు....

ఎన్నికల ఫలితాల వేళ.. ఏపీలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు....

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఎన్నికల ఫలితాల వేళ ఏపీలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో వైసీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు పార్టీ ఆఫీస్ పై రాళ్ల దాడి జరిగింది. కారు అద్దాలను ధ్వంసం చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. అలాగే, అక్కడి వైసీపీ ప్రచార రథం కూడా ధ్వంసం అయింది. కొవ్వూరు ఎమ్మెల్యేగా 33 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు గెలుపొందారు.

గుంటూరులోని గార్డెన్ సెంటర్‌లో వైసీపీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. వైసీపీకి వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు. జై టీడీపీ అంటూ హోరెత్తించారు.

చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఘర్షణ చోటుచేసుకుంది. చెక్కునత్తం గ్రామంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మద్య ఘర్షణ తలెత్తింది. కర్రలతో కొట్టుకున్నారు. పలువురికి గాయాలయ్యాయి.

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలంలో ఇరువర్గాల మద్య ఘర్షణ చెలరేగింది. పలువురు గాయపడ్డారు. ఐ.పోలవరం మండలం గోగుల్లంక పరిధిలోని భైరవలంక గ్రామంలో వర్గవిభేదాలు భగ్గుమన్నారు. దీంతో కార్యకర్తలు మాదేటి శ్రీను, ఉండ్రు పెంటయ్య, కూరాటి ఏడుకొండలకు గాయాలయ్యాయి. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు.