రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. కొత్త నిబంధనలు తెలుసుకోకపోతే జైలుకే..

రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. కొత్త నిబంధనలు తెలుసుకోకపోతే జైలుకే..

ముద్ర,సెంట్రల్ డెస్క్:-రైల్వే టికెట్ బుక్ చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కొత్త నిబంధనలు చెప్తున్నాయి. ఆ నిబంధనలు అతిక్రమిస్తే జైలు పాలు కావటం ఖాయం అని అంటున్నారు రైల్వే అధికారులు. ఎవరికైనా రైల్వే టికెట్ బుక్ చేయటం రాకపోతే.. మన పర్సనల్ ఐడీ ద్వారా టికెట్ బుక్ చేస్తుంటాం. వారి సాయం చేసి పుణ్యం మూట గట్టుకుంటాం. కానీ, ఆ సాయమే మిమ్మల్ని జైలు పాలు చేస్తుందని కొత్త నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వేరే వాళ్లకు టికెట్ బుక్ చేస్తే మంచి చేయటం పోయి.. ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. వ్యక్తిగత ఐడీ నుంచి వేరే ప్రయాణికులకు ఆన్‌లైన్ టికెట్ బుక్ చేయటం నేరం కిందికి వస్తుందని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది.

రైల్వే చట్టం సెక్షన్ 143 ప్రకారం.. అధికారికంగా నియమించిన ఏజెంట్లు మాత్రమే ఇతరులకు టికెట్ బుక్ చేసే అవకాశం ఉంది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10 వేల వరకు జరిమానా పడుతుంది. పర్సనల్ ఐడీ ద్వారా రక్తసంబంధీకులు, ఒకే ఇంటి పేరు కలిగిన వారికి మాత్రమే టికెట్ బుక్ చేసే అవకాశం ఉంటుంది. వీరికి తప్ప.. స్నేహితులకు టికెట్ బుక్ చేసినా అది నేరం కిందకే వస్తుంది. ఇక, ఐడీతో ఆధార్ లింక్ చేసిన వారు నెలకు 24 మందికి టికెట్ బుక్ చేయవచ్చు. ఆధార్ లింక్ లేకపోతే 12 మందికి మాత్రమే టికెట్ బుక్ చేయవచ్చు.

టికెట్ బుకింగ్ విధానం ఇలా..

- ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ఓపెన్ చేసి మీ అకౌంట్‌లోకి లాగిన్ కావాలి.

- బుక్ యువర్ టికెట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

- వెళ్లాల్సిన ప్రదేశం, ఎక్కడి నుంచి వెళ్తున్నారనేది ఎంటర్ చేయాలి.

- ప్రయాణించే తేదీని నమోదు చేయాలి.

- స్లీపర్ క్లాస్, 3- ఏసీ.. ఇలా క్లాస్‌ను ఎంపిక చేసుకోవాలి.

- ఏ రైలు అందుబాటులో ఉందో చూసుకోవాలి.

- ఆ రైలును ఎంచుకొని బుక్ నౌ పై క్లిక్ చేయాలి.

-ప్రయాణికుడి వివరాలు ఎంటర్ చేయాలి.

- మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.

తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్...

- ఏసీ టికెట్ అయితే ఉదయం 10 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది.

- నాన్ ఏసీ టికెట్ అయితే ఉదయం 11 గంటలకు బుకింగ్ ప్రారంభం అవుతుంది.