ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం.. ఎప్పటి నుంచి అమలు అంటే..!

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం.. ఎప్పటి నుంచి అమలు అంటే..!

ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఎపీలో కొత్త ప్రభుత్వం హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ సమయంలోనే పెన్షన్ల పెంపు..అన్నా క్యాంటీన్లు..మెగా డీఎస్సీ పైన సంతకాలు చేసారు.ఇక, టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది. దీని పైన తాజాగా బాధ్యతలు స్వీకరించిన మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక ప్రకటన చేసారు. ఈ పథకం అమలు దిశగా తమ నిర్ణయాన్ని స్పష్టం చేసారు.

ఏపీలో మహిళలకు  మరో నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు.గత ప్రభుత్వ హయాంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదన్నారు. ఉన్న బస్సులనే యథావిధిగా కొనసాగించారన్నారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగుల తో పాటుగా ప్రయాణికులను కాపాడుకునే బాధ్యత తమాపై ఉందని ఆయన పేర్కొన్నారు

ప్రభుత్వం కసరత్తు

తమ కూటమి సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని చెప్పుకొచ్చారు. మరో నెల రోజుల్లో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కసరత్తు ప్రారంభించినట్లు చెప్పారు. అన్ని మార్గదర్శకాలు త్వరలోనే రిలీజ్ అవుతాయన్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో అమలు చేస్తున్న ఈ పథకం పైన ఆర్టీసీ అధికారులు నివేదిక సిద్దం చేసారు. అక్కడ ఏ సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలుసుకొని ఇక్కడ విధి విధానాలు ఖరారు చేస్తున్నారు.

త్వరలోనే నిర్ణయం

ప్రధానంగా తెలంగాణలో అమలు అవుతున్న ఆధార్ నియమావళిని, జీరో టికెట్ పద్దతిని అక్కడ కూడా పాటిస్తారా లేదా ఇతర విధివిధానాలు అమలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే, ఈ పథకం అమలుకు ముందే కొత్త బస్సులను తీసుకోవాల్సి ఉందని ఆర్టీసీ యూనియన్లు చెబుతున్నాయి. దీంతో, మంత్రివర్గ సమావేశంలో ఈ పథకం అమలు దిశగా కాల పరిమితి..తీసుకోవాల్సిన చర్యల పైన ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.