పానుగల్ మండలంలో జోరుగా అక్రమ ఇసుక రవాణా
- భారీగా ఇసుక డంపులు
- వరి ధాన్యం మాదిరిగా ఇసుక కుప్పలు
- పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు
ముద్ర,పానుగల్:- పానుగల్ మండలంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది. మండలంలోని గోప్లాపూర్,చిక్కేపల్లి, దావాజిపల్లి,బుసిరెడ్డిపల్లి, తెల్లరాళ్లపల్లి తదితర గ్రామాలలో అక్రమ ఇసుక రవాణా జరుగుతుంది.గోప్లాపూర్ గ్రామంలో పాఠశాల సమీపంలో భారీగా ఇసుకను డంపు చేశారు.రాత్రి వేళలో ఇతర గ్రామాలకు ఒక్కొక్క ట్రాక్టర్కు 3 వేలు చొప్పున విక్రయిస్తున్నారు..వరి కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యాల మాదిరిగా ఇసుక కుప్పలు కుప్పలుగా పోసుకొని పగలు,రాత్రి వేళలో యతేచ్చగా విక్రయిస్తున్నారు.
కొన్ని రోజులుగా సాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై సంబంధిత శాఖలైన రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ ఇసుక రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోయింది.పోలీసులకు ముడుపులు చెల్లించి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నట్లు సమాచారం.. గ్రామాలలో ఇష్టానుసారంగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నప్పటికీ అధికారులు,పోలీసులు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి పలువురు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాపై తగిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.