నిరంతర దోపిడీకి గురవుతున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు

నిరంతర దోపిడీకి గురవుతున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికులు
  • అఖిల భారత మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు డా. బి.వి. విజయలక్ష్మి 

ముద్ర, ముషీరాబాద్: సకాలంలో వంట బిల్లులు, వేతనాలు చెల్లించక ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికులను నిరంతర దోపిడీకి గురిచేస్తుందని అఖిల భారత మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బి.వి. విజయలక్ష్మి ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనం కంటే మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే వేతనం చాలా తక్కువ అని అన్నారు. ఇందులో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందిన మహిళలు, వితంతువులు పనిచేస్తున్నారని, వారికి రోజుకు 30 రూపాయల కూలి కూడా అందడం లేదన్నారు. తమ న్యాయమైన సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్న భోజన వంట కార్మికుల భారీ ధర్నా జరిగింది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుండి వందలాదిమంది మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నాలో పాల్గొని తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేసారు. ఈ ధర్నా కార్యక్రమంలో  డాక్టర్ బి.వి. విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొనగా,  తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.ప్రేమ్ పావని అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా డాక్టర్ బి.వి. విజయలక్ష్మి ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 54201పైగా మధ్యాహ్న భోజన వంట కార్మికులు 28 లక్షలకు పైగా విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తూ తమ విధులు నిర్వహిస్తున్నారని. రెండు దశాబ్దాలుగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పథకం నిరాఘాటంగా కొనసాగేందుకు ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి విద్యార్థులకు సకాలంలో ఆహారాన్ని అందిస్తున్న వంట కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం మాత్రం దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు. 

అప్పులు చేసి కూరగాయలు, కిరాణం సామాన్లు, కోడి గుడ్లు కొనుగోలు చేసి వంటలు చేస్తే, వండిన వంటకు బిల్లులతోపాటు వేతనాలు కూడా అయిదు, ఆరు నెలల వరకు రాక తెచ్చిన అప్పులు తీరక అప్పులు దొరుకక మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తీవ్ర  ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం ముఖ్యమైన పోషకాహార పథకంగా పరిగణించబడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా అని ఆమె ప్రశ్నించారు. కార్మికులు వంటలు చేస్తున్న సందర్భంలో కట్టెల పొగతో కంటి చూపులు దెబ్బతింటున్నాయని చెప్పారు. ప్రభుత్వం వీరి సమస్యలపై స్పందించకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తక్షణమే స్పందించి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసారు. ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజ్ మాట్లాడుతూ సంవత్సరంన్నర క్రితం భోజన పథకం కార్మికులకు రూ.1000 ఉన్న గౌరవ వేతనాన్ని రూ.3000లకు పెంచుతున్నట్లు ప్రకటించారని, ఇప్పటివరకు పెంచిన వేతనాలు వంట కార్మికులకు ఖాతాలో జమకాలేదని తెలిపారు. వంట ఖర్చుల బిల్లులు కూడా చెల్లించకపోవడం అన్యాయం అని, ప్రభుత్వం కనికరంలేకుండా శ్రమ దోపిడీకి గురి చేస్తుందని అయన మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై సమ్మెను ఇంకా తీవ్రతరం చేయాలనీ పిలుపునిస్తూ ఏఐటీయూసీ వంట కార్మికులకు మద్దతుగా ఉంటుందని తెలిపారు. 

సంఘం ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ వేతనాలతోపాటు వంట కార్మికుల వంట బిల్లులు 9 నెలల కాలంగా పెండింగ్  ఉన్నాయని, అధికారులకు పదే పదే అధికారులకు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం దక్కడంలేదని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. పి. ప్రేమ్ పావని  మాట్లాడుతూ మధ్యాహ్న భోజన వంట కార్మికుల సమ్మెలో భాగంగా ఈ నెల 17 న ఎమ్యెల్యేల ఇళ్లను, 19 న మండల విద్య అధికారుల కార్యాలయాలను, 21 న జిల్లా విద్య అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని, 25 న జిల్లాల లేబర్ అధికారికి వినతి పత్రం అందజేస్తామని అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే వేలాదిమంది మధ్యాహ్న భోజన వంట కార్మికులతో ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో  ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఏం. నరసింహ, కార్యదర్శి నండూరి కరుణకుమారి, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు  డి. కమల రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు పూసల రమేష్, ఉపాధ్యక్షులు కోరిమి సుగుణ, కుంటల రాములు, దండు లక్ష్మణ్, చెన్నం దశరథం, కార్యదర్శులు బి. రాజేశ్వరి, బి. ప్రసాద్, దర్యాల రామ్మూర్తి, బొజ్జ సాయిలు, నేతలు రమేష్, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.