అబ్ కీబార్..​కిసాన్​సర్కార్​

అబ్ కీబార్..​కిసాన్​సర్కార్​
  • కేసీఆర్​పర్యటనలో మిన్నంటిన నినాదాలు
  • 2 బస్సులు, 600 కార్లతో షోలాపూర్ కు చేరుకున్న సీఎం
  • ఘన స్వాగతం పలికిన నేతలు
  • నేడు పండరీపురానికి బీఆర్ఎస్​అధినేత
  • విఠేశ్వర స్వామి, తుల్జా భవానీ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం షోలాపూర్‌ చేరుకున్న సీఎం కేసీఆర్​కు ఘన స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ప్రగతిభవన్ నుంచిహైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, 600  కార్ల భారీ కాన్వాయ్‌లతో ఆయన బయలుదేరారు. మధ్యాహ్నం ధారాశివ్‌ జిల్లా ఒమర్గాలో భోజనం చేశారు. తర్వాత సాయంత్రం షోలాపూర్‌కు చేరకున్నారు. అక్కడ కేసీఆర్ కు బీఆర్‌ఎస్‌ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేతలు ‘అబ్​కీ బార్​.. కిసాన్​సర్కార్’ అని నినాదాలు చేశారు. కాగా సీఎం కేసీఆర్‌ రాత్రి షోలాపూర్‌లోనే బస చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు పండరీపురానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ రుక్మిణీ సమేత విఠేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సోలాపూర్‌ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతారు. ఆ తర్వాత ధారాశివ్‌ జిల్లాలో కొలువుదీరిన శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర పర్యటనకు వెళ్లినవారిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిన తొలినాళ్లలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఢిల్లీకి వినిపించేందుకు 2003లో ‘చలో ఢిల్లీ’ పేరుతో భారీ కారు ర్యాలీ నిర్వహించి దేశం దృష్టిని ఆకర్శించిన తరహాలోనే మళ్లీ 20 యేళ్ల తరువాత కేసీఆర్ అదే తరహా యాత్ర చేపట్టం విశేషం.

దారిపొడవునా ఫ్లెక్సీలు..

కేసీఆర్ కాన్వాయి కొనసాగిన రహదారులు కొత్త శోభను సంతరించుకున్నాయి. ముంబై రహదారి మీదుగా ప్రయాణిస్తున్న సీఎం కాన్వాయ్ కి రహదారి పొడుగునా పూలు చల్లుతూ, గులాబీ కాగితాలు వెదజల్లుతూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్ నినాదాలతో టిఆర్ఎస్ శ్రేణులు, సీఎం కేసీఆర్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్​కు స్వాగతం, దేశ్ కి నేత కైసే హో – కేసీఆర్ జైసా హో( దేశ నాయకుడు ఎలా ఉండాలి– కేసీఆర్ లా ఉండాలి) అంటూ మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ధారాశివ్ కు చేరుకున్న సీఎం కేసీఆర్ గారికి అక్కడి స్థానిక నాయకులు, మహిళలు సాంప్రదాయ రీతిలో హారతినిచ్చి, స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ షోలాపూర్ కు బయలుదేరారు. ఆ సమయంలో జోరువాన కురుస్తున్నా లెక్కచేయకుండా సీఎం కాన్వాయ్ ముందుకు సాగింది. షోలాపూర్ కు చేరుకున్న కేసీఆర్ పై స్థానిక నాయకులు, శ్రేణులు గులాబీ పూల వర్షం కురిపించాయి. ఆయనకు స్వాగతం పలుకుతూ డప్పు దరువులతో  ఆ ప్రాంతమంతా మారు మోగింది. ‘దేశ్ కి నేత కేసీఆర్’ నినాదాలతో హోరెత్తించారు. ‘అబ్ కి బార్.. కిసాన్ సర్కార్’ నినాదాలు మిన్నంటాయి. షోలాపూర్ ప్రజల అపూర్వ స్వాగతం మధ్య సీఎం కేసీఆర్ బాలాజీ సరోవర్ హోటల్ కు చేరుకొని కాసేపు సేదతీరారు. 

ధర్మన్న ముండయ్య ఇంట్లో ఆతిథ్యం..

సీఎం కేసీఆర్ హోటల్ నుంచి బీఆర్ఎస్ నాయకుడు ధర్మన్న ముండయ్య సాదుల్ ఆహ్వానం మేరకు, సోలాపూర్ భావనారుషి పేట్ లోని వారి ఇంటికి వెళ్లి ఆథిత్యం స్వీకరించారు. ధర్మన్న సాదుల్ ఒక పర్యాయం మేయర్ గా, రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున షోలాపూర్ ఎంపీగా పనిచేశారు. ఈ సందర్భంగా ధర్మన్న సాదుల్ తన కుటుంబ సభ్యులను కేసీఆర్​కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ధర్మన్న సాదుల్ తో సమకాలీన రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ రాత్రి బస నిమిత్తం బాలాజీ సరోవర్ హోటల్ కు తిరిగి చేరుకున్నారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, జగదీశ్వర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కే కేశవ రావు, ఎంపీ నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.