సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలి 

సజావుగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలి 
  • ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలి
  • ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదుల కోసం 24 గంటలు 1950 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ఏర్పాటు
  • సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయవచ్చు
  • లోక్ సభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని పాత్రికేయులతో ప్రెస్ మీట్ నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 


ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: భారత ఎన్నికల కమీషన్ మార్గదర్శకాల ప్రకారం లోక్ సభ సాధారణ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు తమవంతు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్  కోరారు.సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ లు జే.అరుణశ్రీ, జి.వి. శ్యామ్ ప్రసాద్ లతో  కలిసి జిల్లాలో లోక్ సభ సాధారణ ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమీషన్ లోక్ సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ 18న వస్తుందని, ఏప్రిల్ 18  నుంచి ఏప్రిల్ 25 తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, ఏప్రిల్ 26 వరకు నామినేషన్ల స్క్రూటినీ, ఏప్రిల్ 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, మే 13న పోలింగ్, జూన్ 4 న కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందన్నారు. 

పెద్దపల్లి జిల్లాలో ఓటరు జాబితా సవరణ తుది ఓటరు జాబితా ప్రకారం 7 లక్షల 15 వేల 735 మంది ఓటర్లు, 628 మంది సర్వీస్ ఓటర్లు, 53 మంది ఎన్.ఆర్.ఐ ఓటర్లు ఉన్నారని, మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 1850 పోలింగ్ కేంద్రాలలో మొత్తం 15 లక్షల 92 వేల 996 మంది ఓటర్లు 1395 మంది సర్వీస్ ఓటర్లు, 102 మంది ఎన్.ఆర్.ఐ ఓటర్లు ఉన్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేరు సరి చూసుకోవాలని, జాబితాలో పేరు లేని వారు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని తెలిపారు. 


జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన మేర 840 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్ కు రెండు కిలోమీటర్ల రేడియస్ లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, అవసరమైన మేర 2291  బ్యాలెట్, 1243 కంట్రోల్ యూనిట్లు, 1264  వివి ప్యాట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు.  ఎన్నికల కమీషన్ లోక్ సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి వర్తిస్తుందన్నారు. 

కులం, మతం, ప్రాంతంపై విద్వేషాలు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమని, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, బెదిరింపులకు పాల్పడటం, తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు,  నాయకులకు సమావేశాలు నిర్వహించు కునేందుకు సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతులు అందిస్తామని, ముందు ఎవరు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతి ఉంటుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వినియోగించడానికి వీలులేదన్నారు. 

రాజకీయ సమావేశాలు ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థన స్థలాలల్లో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 20  సర్వేలెన్స్ బృందాలను,  21 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను,  14 వీడియో సర్వేలెన్సు బృందాలను,  8 వీడియో వ్యూయింగ్ బృందాలు, ఇతర కమిటీలను ఏర్పాటు చేశామని,  ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు 1950 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా, సి-విజల్ యాప్ ద్వారా చేయవచ్చని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదులు స్వీకరించేందుకు 24 గంటల పాటు కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, సి -విజల్ యాప్ లో లైవ్ వీడియో అప్ లోడ్ చేసిన వెంటనే గడువు లోపు అధికారులు క్షేత్రస్థాయిలో చేరుకొని ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటారన్నారు. 

రాజకీయ పార్టీలకు సంబంధించిన వాల్ రైటింగ్, ఫ్లెక్సీలు, హోర్డింగులు,ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో 24 గంటల  వ్యవధిలో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ పెట్రోల్ బంక్ మొదలైన పబ్లిక్ ప్లేస్ లలో 48 గంటల వ్యవధిలో, అనుమతి లేని ప్రైవేట్ స్థలాలలో 72 గంటల వ్యవధిలో పూర్తి స్థాయిలో తొలగిస్తామని తెలిపారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, వీటిని పరిగణలోకి తీసుకొని సజావుగా ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా 50వేలకు మించి నగదుతో ప్రయాణించవద్దని, ప్రతిరోజు తనిఖీలలో జప్తు చేసిన సొమ్మును జిల్లాలో ఏర్పాటు చేసే గ్రీవెన్స్ కమిటీకి అప్పగిస్తామని, ఆధారాలు సమర్పించి గ్రీవెన్స్ కమిటీ నగదు విడుదల చేస్తుందని తెలిపారు. 
ఈ సమావేశంలో పాత్రికేయులు, సంభందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.