ముత్తారం సింగల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి అక్రమాల పై కలెక్టర్ కు, డిసిఓ కు ఫిర్యాదు

ముత్తారం సింగల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి అక్రమాల పై కలెక్టర్ కు, డిసిఓ కు ఫిర్యాదు
  • ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి లో ఇన్సూరెన్స్ చేస్తేనే లోనులు ఇస్తానని, రైతులను ఇబ్బందులు పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సీఎల్ ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య

ముద్ర ముత్తారం:- ముత్తారం సింగిల్ విండో కార్యాలయంలో జరిగిన అక్రమాల పై సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు, డిసిఒకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య సోమవారం పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ముత్తారం మండల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత 5 ఏండ్లుగా జరుగుతున్న సుతిలి కొనుగోలు పేరిట జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణం పై, కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగుల తరహాలో సుతిలి పంపిణీ, సహాకారసంఘంలో జరిగిన అవినీతి పై విచారణ జరపాలని మద్దెల రాజయ్య కోరారు. ముత్తారం మండలంలో సివిల్ సప్లై సహకార శాఖ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి సీజన్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి దాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, ఇట్టి దాన్యం కొనుగోలు కేంద్రాలకు అవసరమైన గన్నీ సంచులను ప్రభుత్వం ఆధ్వర్యంలోని సివిల్ సప్లై శాఖ సరఫరా చేస్తుండగా వాటిని కుట్టడానికి అవసరమైన సుతిలి దారాలు మాత్రం ఆయా కొనుగోలు కేంద్రాల వారే కొనుగోలు చేస్తున్నారని, ప్రతి ఖరీప్, రబీ సీజన్ లో సహకార శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సింగిల్ విండో సొసైటీల్లో గత కొన్ని సంవత్సరాలుగా కేవలం సుతిలి దారాల ఖర్చు లక్షల్లో రాస్తూ ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారన్నారని అన్నారు. ముత్తారం సింగిల్ విండో సొసైటీలో ఏకంగా ప్రతి సీజన్ లో లక్షల్లో కేవలం సుతిలి దారాల, వాటర్ బిల్లు, ల్యాండ్ రెంట్ పేరిట, ఆఫీస్ మెయింటినెన్స్ ఖర్చుల కింద రాస్తున్నారంటే ప్రభుత్వ నిధులు ఏవిధంగా పక్కదారి పడుతున్నాయో అర్థమవుతుందన్నారు. గత మూడు ఏండ్లుగా సుతిలి కొనుగోలు పేరిట కోట్లాది రూపాయల కుంభకోణం జరిగినట్టుగా పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయని, ముత్తారం సహకార సంఘం నుండి సరఫరా ఐన ఎరువులను, పురుగుల మందులను ప్రయివేట్ వ్యాపారులకు అక్రమంగా అమ్ముకొని రైతుల పేరిట తప్పుడు బిల్లులు సృష్టించారని పేర్కొన్నారు. అదేవిధంగా సహకార సంఘం రిజిస్టర్ మరియు డైరెక్టర్ కు తెలంగాణ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు రాజయ్య తెలిపారు

ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ చేస్తేనే లోనులు రైతులకు ఇస్తున్నాడు 

అదే విదంగా సహకార సంఘం నుండి లోను తీసుకుంటే ప్రతి ఒక్క సభ్యుని చేత ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన ఇన్సూరెన్స్ లో తప్పనిసరిగా పాలసి చేయాలనీ బలవంతం చేసి రూ. 20 వేల నుండి 50 వేల వరకు ఇన్సూరెన్స్ డబ్బులు కాటు చేసుకుని రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడని, అ ఇన్సూరెన్స్ కంపెనీలో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి అతని భార్య, కొడుకు, ఏజెంట్ గా పని చేస్తున్నారని. తన పదవిని అడ్డుపెట్టుకొని అక్రమంగా సంపాదన చేసిన గుజ్జుల రాజిరెడ్డి పై విచారణ జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సీజన్ లో గన్నీ సంచుల తరహాలోనే సుతిలి కూడా సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో సరఫరా జరిగేట్టు చర్యలు తీసుకోవాలని, ఎవరూ కూడా బయట మార్కెట్ లో సుతిలి కొనుగోలు చేయకుండా తగు ఆదేశాలు జారీ చేయాలని ఫిర్యాదులో రాజయ్య కోరారు.