కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌కు హైకోర్టు నోటీసులు....ఎందుకంటే...?

కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్‌కు హైకోర్టు నోటీసులు....ఎందుకంటే...?

ముద్ర,తెలంగాణ:- ఇటీవల స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరిన చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలకు తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన కడియం, వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. వీళ్లిద్దరిపై అనర్హత వేటు వేయాలని.. హైకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై మంగళవారం విచారణ జరిగింది. ఈ విషయానికి సంబంధించి అసెంబ్లీ ఆఫీసులో ఫిర్యాదు చేసేందుకు వెళ్లే తమను లోపలికి కూడా అనుమతించలేదని.. అందుకే హైకోర్టుకు వచ్చామని పిటిషనర్ తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరడం ఫిరాయింపుల చట్ట నిబంధనలకు వ్యతిరేకమని అన్నారు. ఈ నేఫథ్యంలోనే హైకోర్టు.. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్‌ దాఖలు చేయాలని వారికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇలాంటి కేసులోనే ఇటీవల దానం నాగేందర్‌కు కూడా నోటీసులు వెళ్లాయి. దానం నాగేందర్ బీఆర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో.. రాజు యాదవ్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని కోరారు. దీంతో దానం నాగేందర్‌కు కూడా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు పంపింది.