మీడియా స్వేచ్ఛను హరించడమంటే

మీడియా స్వేచ్ఛను హరించడమంటే
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే!
  • కేంద్రం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తోంది
  • మోడీ సర్కార్ తీరుపై విరుచుకుపడిన వక్తలు
  • న్యూస్ క్లిక్ పై దాడులను ఖండిస్తూ జర్నలిస్టుల భారీ ర్యాలీ

ముద్ర, హైదరాబాద్​: పాలకులు మీడియా స్వేచ్ఛను హరించడమంటే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై జరిగిన దాడులను గర్హిస్తూ హైదరాబాదులో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, టీయూడబ్ల్యూజే దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గురువారం భారీ ర్యాలీ జరిగింది. అనంతరం ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ సర్కిల్ లో ఐజేయూ అధ్యక్షుడు కే.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించారు. 

మీడియాపై ఉక్కుపాదం మోపితే సహించం..

కేంద్రంలో ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తూ మీడియా మీద, పౌర సంస్థల మీద ఉక్కుపాదం మోపడం సహించారనిదన్నారు. న్యూస్ క్లిక్ పోర్టల్ కార్యాలయంపై, అందులో పని చేస్తున్న 47 మంది జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసులు దాడులు జరిపిన తీరు దిగ్బ్రాంతి కలిగించిందని పేర్కొన్నారు. ఎందుకు సోదాలు జరుపుతున్నారో, ఎందుకు అరెస్టులు చేస్తున్నారో తెలపకుండా చీకటి రోజులను గుర్తు చేసే విధంగా ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వ్యవహరించారని వారు ఆరోపించారు. కఠినమైన ఉపా చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నామని చెబుతున్న పోలీసులు.. ముందుగా ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయడం లేదో చెప్పడంలేదని ఆరోపించారు. చైనా పెట్టుబడులను బూచిగా చూపి ప్రజాస్వామ్యాన్ని హరించాలని చూస్తున్నారని ఆరోపించారు. కారణం చెప్పకుండా అరెస్టు చేయడం ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమేనని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే.సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇందిరా గాంధీ హయాంలో 1975లో ప్రకటిత ఎమర్జెన్సీ అమలు కాగా నేడు మోడీ పాలనలో అప్రకటి ఎమర్జెన్సీని అమలు చేస్తూ ప్రజాస్వామ్య సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

స్వేచ్ఛ లేని బతుకు అర్థరహితం..

స్వేచ్ఛ లేని బతుకు అర్థరహితమని, దాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం దురదృష్టకరమని మానవ హక్కుల నేత, ప్రముఖ రచయిత ప్రొఫెసర్ హరగోపాల్ తెలిపారు. దేశంలో కొనసాగుతున్న నిర్బంధకాండ ప్రమాదకర పరిస్థితులను సూచిస్తోందని వ్యాఖ్యానించారు. సుప్రసిద్ధ పాత్రికేయుడు కె రామచంద్రమూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కే. శ్రీనివాస్ మాట్లాడుతూ మీడియా స్వేచ్ఛ, భావ ప్రకటన స్వాతంత్ర్యంపై జరుగుతున్న దాడులను ప్రతిఘటించడానికి జర్నలిస్టులంతా సమైక్య పోరాటం సాగించాల్సిన అవసరం ఆసన్నమైందని చెప్పారు.

ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రదర్శన గ్రాండ్ సక్సెస్

మీడియా సంస్థలు, జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ లో జర్నలిస్టులు గర్జించారు. ‘మీడియా స్వేచ్ఛను హరిస్తే ఖబడ్దార్.. ఢిల్లీ పోలీసుల వైఖరిని ఖండిస్తున్నాం.. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుదాం.. రాజ్యాంగ హక్కులను గౌరవిద్దాం’ అంటూ జర్నలిస్టులు చేసిన నినాదాలు మారుమోగాయి. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే)ల నేతృత్వంలో, హెచ్.యూ.జే, హైదరాబాద్ ప్రెస్ క్లబ్, నెట్వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా ఇండియా, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ చిన్న, మధ్యతరహా పత్రికలు, మేగజైన్స్ అసోసియేషన్ ల భాగస్వామ్యంతో జరిగిన భారీ నిరసన విజయవంతమైంది. బషీర్ బాగ్ లోని టీయూడబ్ల్యూజే కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుంది. ఆయా ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ ఆందోళన కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించాయి. అనంతరం ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహం వద్ద సభ జరిగింది. ప్రదర్శన, సమావేశంలో సుప్రీం కోర్టు మాజీ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి, పి.ఎల్.విశ్వేశర్ రావు, పద్మజషా, ఖాసీం, సీనియర్ సంపాదకులు కే.రామచంద్ర మూర్తి, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్, విశాలాంధ్ర సంపాదకులు ఆర్.వి.రామారావు, సియాసత్ సంపాదకులు అమీర్ అలీ ఖాన్, సీనియర్ జర్నలిస్టులు కట్టా శేఖర్ రెడ్డి, వీక్షణం వేణు, పాశం యాదగిరి, తోట భవనారాయణ,  రహ్మాన్, ప్రముఖ రచయిత, గాయకులు జయరాజ్, సామాజిక  నిపుణులు రమా మేల్కొటే, సజయ, ఉమెన్ అండ్ ట్రాన్స్ జెండర్ జేఏసీ బాధ్యురాలు సంధ్య, ఓ.పి.డి.ఆర్ బాధ్యురాలు జయ వింధ్యాల, ఎన్.డబ్ల్యూ.ఎం.ఐ బాధ్యురాలు వనజ, సామాజిక కార్యకర్త జస్విన్ జైరత్, మానవ హక్కుల వేదిక బాధ్యులు జీవన్ కుమార్, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కే.విరాహత్ అలీ, ఐజేయూ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, ఐజేయూ నాయకులు ఎం.ఏ.మాజీద్, కల్లూరి సత్యనారాయణ, డి.కృష్ణారెడ్డి, హెచ్.యూ.జె అధ్యక్ష, కార్యదర్శులు శిగా శంకర్ గౌడ్, షౌకత్, టీయుడబ్ల్యుజె రాష్ట్ర నాయకులు ఏ.రాజేష్, బి.కిరణ్, మల్లయ్య, యం.వెంకట్ రెడ్డి, చిన్న, మధ్యతరహా పత్రికలు మరియు మేగజైన్స్ అసోసియేషన్ అధ్యక్షులు యూసుఫ్ బాబు, తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గంగాధర్, హరి, హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు జి.బాల్ రాజ్, న్యూడెమోక్రసీ బాధ్యుడు గోవర్ధన్ లతో పాటు 300 మంది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.


మీడియా స్వేచ్ఛను హరించే యత్నం
సుప్రీం సీజేఐకి ఐజేయూసహా 18 మీడియా సంస్థల లేఖ
 
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియాను స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదని, మీడియా స్వేచ్ఛపై దాడి చేస్తూ.. పీకనొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై. చంద్రచూడ్ కు 18 మీడియా సంస్థలు గురువారం లేఖ రాశాయి. మీడియా సంస్థలు సుప్రీం తలుపు తట్టడం అరుదైన విషయం. న్యూస్ క్లిక్ పై జరిగిన దాడులకు నిరసనగా దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలు, మేధావులు, రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, కవులు, కళాకారులూ రోడ్డెక్కారు. కేంద్రం తీరుపై నిరసన తెలుపుతూ మాజీ హైకోర్టు, సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులు, ప్రముఖ జర్నలిస్టులు, అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ తమపై ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారంటూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు రాసిన లేఖలో పేర్కొన్నాయి. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై కొందరు జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడం లేదని, సోదాల పేరిట వారిని కట్టడి చేసేందుకు ప్రతీకార దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయులు చట్టానికి అతీతంగా ఉండాలని తాము కూడా కోరుకోవడం లేదని, కానీ పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య పునాదులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. న్యూస్ క్లిక్ ఆన్ లైన్ పోర్టల్ లో పని చేసే 46 మంది ఉద్యోగుల ఇళ్లలో కొన్ని రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు సోదాలు చేశారు. పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సీజేఐకి మీడియా సంస్థలు లేఖ రాశాయి.