అజ్ఞాతంలోకి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

అజ్ఞాతంలోకి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు

జనగామ జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మొత్తం 11 మంది బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ జమునపై అవిశ్వాసం పెట్టాలని అందరూ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి లంచ్‌ ఆహ్వానాన్ని కూడా బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు తిరస్కరించారు. పాత పాలక వర్గం భారీ అక్రమాలు, అవినీతికి పాల్పడిరదని సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తూ ఓ లేఖను విడుదల చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు.

అధికార పార్టీ కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లడంతో బీఆర్‌ఎస్‌ నేతలు టెన్షన్‌ పడుతున్నారు. జనగామ మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అందులో 18 మంది బీఆర్‌ఎస్‌, 8 మంది కాంగ్రెస్‌, నలుగురు బీజేపీ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు. విప్లవాల ఖిల్లా.. ఉద్యమాల్లో పిడికిలెత్తిన జిల్లా మానుకోట. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌ సాక్షిగా ఎంతటి పోరాటం జరిగిందో అందరికీ తెలిసిందే. అంతటి చైతన్యాన్ని అందించిన మానుకోటలో బీఆర్‌ఎస్‌ పార్టీకి గ్రూపుల కారణంగా బీటలు వారుతున్నాయి. ఒకే గిరిజన జాతికి చెందిన బిడ్డల పంచాయితీ రచ్చకెక్కుతుండడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగిన వారి మధ్య నెలకొన్న విభేదాలు అందరి దృష్టిని అటుగా చూపించే పరిస్థితికి చేర్చాయి.

వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చట్ట సభలో అడుగు పెట్టాలన్న లక్ష్యం ఒకరిద్దరిదైతే, తమ బెర్త్‌ ఖాయం చేసుకోవాలన్న తపన మరికొందరిది. వారసులకు ఎంట్రీ ఇవ్వాలని మరోనేత ప్రయత్నాలు.. ఇలా ఎవరి లక్ష్యాలను వారు నిర్దేశించుకుని గ్రూపులుగా విడిపోయి ముందుకు సాగుతున్న తీరే విస్మయానికి గురి చేస్తోంది.మహబూబాబాద్‌ జిల్లాలో నెలకొన్న వార్‌ బహిరంగంగానే సాగుతోంది. జిల్లా కేంద్రం సిట్టింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యేకు మధ్య ఏ మాత్రం పొసగడం లేదని ఇటీవల కాలంలో జరిగిన బహిరంగ సభల్లో వీరిద్దరూ వ్యవహరించిన తీరు స్పష్టం చేస్తోంది. అలాగే పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎవరి క్యాంపు ఆఫీసులకు వారు పరిమితం అవుతున్నారు. సొంత ప్రభుత్వానికి సంబంధించిన సంబరాలే అయినా ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధించడమే అయినా వేర్వేరుగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మానుకోట జిల్లా అద్యక్షురాలిగా స్థానిక ఎంపీ మాలోతు కవిత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ తో విబేధాలు ఉండడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపున డోర్నకల్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ తన తనయుడు రవిచంద్రకు టికెట్‌ ఇవ్వాలన్న ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతోంది.

అయితే అదే సీటుపై మరో ఇద్దరు మహిళా నాయకుల దృష్టి పడినట్టుగా బీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో వైపున శంకర్‌ నాయక్‌ కు మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆశీస్సులు అందిస్తున్నారని ప్రత్యర్థి వర్గం కినుక వహిస్తోంది. అలాగే ఎంపీ మాలోతు కవిత మహబూబాబాద్‌ టికెట్‌ ఆశిస్తున్నారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మానుకోటలో ఓ వేదికపై మాజీ ఎంపీ సీతారామ్‌ నాయక్‌ ప్రసంగిస్తున్న క్రమంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగానే మాజీ ఎంపీ కౌంటర్‌ ఇచ్చారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనలో కూడా తనకే ప్రాధాన్యత ఇచ్చారని, సిట్టింగ్‌ లకే అవకాశం ఇస్తామని సీఎం ప్రకటించారని శంకర్‌ నాయక్‌ వర్గం బలమైన వాదనలు వినిపిస్తోంది.