నేను పదేళ్లు సీఎంగా ఉన్నా... ఫోన్ ట్యాపింగ్‌పై కచ్చితంగా క్లారిటీ ఇస్తా: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

నేను పదేళ్లు సీఎంగా ఉన్నా... ఫోన్ ట్యాపింగ్‌పై కచ్చితంగా క్లారిటీ ఇస్తా: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిజానిజాలు బయటకు తీసుకువస్తానన్న కేసీఆర్
  • ఫోన్ ట్యాపింగ్‌పై రెండుమూడు రోజుల్లో స్పందిస్తానన్న బీఆర్ఎస్ అధినేత
  • చవటలు, దద్దమ్మలు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆగ్రహం

'నేను పదేళ్ల పాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాను... ఫోన్ ట్యాపింగ్‌పై కచ్చితంగా క్లారిటీ ఇస్తాను... అందులోని నిజానిజాలు బయటకు తీసుకువస్తా'నని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. సిరిసిల్లలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ... ఈ విషయంపై రెండు మూడు రోజుల్లో స్పందిస్తానన్నారు.

విద్యుత్ కొరతపై అధికార కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'పవర్ షార్టేజ్ ఎందుకు అవుతోంది? అంటే మీరు పక్కా చవటలు, దద్దమ్మలు, చేతగాని చవటలు' అని మండిపడ్డారు. అంతకుముందు ఇదే పరిస్థితి ఉంటే ఏడాదిలో తాము అంతా క్లియర్ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ వలే పీఆర్ స్టంట్లు చేయలేదన్నారు. అలాంటప్పుడు మేం అసమర్థులం... ప్రభుత్వం నడపడం చేతకాదని అంగీకరించాలన్నారు.