తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు
  • రాజకీయ పరిణతి, అనుభవంలేని రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని హెచ్చరిక
  • కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో సీఎంలు స్వతంత్రంగా వ్యవహరించలేరని వ్యాఖ్య
  • ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ పెద్దల అనుమతి తీసుకోవాల్సిందేనని ఎద్దేవా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి తీవ్రవ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె సూర్యాపేట జిల్లా నడిగూడెంలో రాజావారికోటలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాజకీయ పరిణతి, అనుభవంలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలకు కష్టాలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు స్వతంత్రంగా వ్యవహరించలేరన్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ పెద్దల అనుమతి తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.

ప్రజాసమస్యల పరిష్కారమంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చినంత సులువు కాదన్నారు. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారన్నారు. ప్రతి రంగంలో అభివృద్ధిని చేసి చూపించారని కితాబునిచ్చారు. రైతులను ఆదుకున్నారని కొనియాడారు. భూగర్భ జలవనరులు పెరిగేందుకు మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పూడికతీత చేపట్టారని... మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన నీటిని అందించారన్నారు.