మద్యం మత్తులో మృతదేహంతోనే 18 కిలోమీటర్ల జర్నీ...
ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఎదురుగా వస్తున్న బైక్ని ఢీ కొట్టింది. కారు ఢీకొట్టిన వేగానికి బైక్ నడుపుతున్న వ్యక్తి ఎగిరి కారు బానెట్పై పడ్డాడు. తీవ్రగాయాలతో అక్కడే చనిపోయాడు. అయితే.. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ బానెట్పై మృతదేహం ఉన్న విషయాన్ని కూడా గమనించకుండా అలాగే 18 కిలోమీటర్లు వెళ్లాడు. కారుపై మృతదేహాన్ని చూసి గ్రామస్తులు ఆపడంతో కారును వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.
కూడేరు మండలం చోళ సముద్రానికి చెందిన జిన్నే ఎర్రి స్వామి(35) ట్రాక్టర్ మెకానిక్.. భార్య మంజుల, ఇద్దరు పిల్లలతో కలిసి అనంతపురంలో స్థిరపడ్డాడు. ఆదివారం సిద్ధరాంపురం వెళ్లిన అతను రాత్రి 10గంటల ప్రాంతంలో బైక్పై తిరుగుప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో వై కొత్తపల్లి సమీపంలో కళ్యాణదుర్గం వైపు వెళుతున్న ఓ కారు స్వామి బైక్ను ఢీ కొట్టింది. వేగంగా ఢీ కొట్టడంతో స్వామి ఎగిరి కారు బానెట్ పై పడి చనిపోయాడు.