జగన్ పాలకుడు కాదు...కక్ష సాధించేవాడు: -నందమూరి బాలకృష్ణ

జగన్ పాలకుడు కాదు...కక్ష సాధించేవాడు: -నందమూరి బాలకృష్ణ

ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్షనేతలపై కక్ష సాధింపునకు  పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్బాగ్యమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తాను  16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష సాధిస్తున్నారని అన్నారు.  స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు?  అని ఆయన ప్రశ్నించారు.  స్కిల్ డెవలప్ మెంట్ పెద్ద కుంభకోణమనే  ప్రచారం తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇది కావాలని రాజకీయ కక్షతో  చేస్తున్న కుట్ర అన్నారు. 19.12.2021 లో ఎఫ్ ఐఆర్ నమోదైందని, నిజంగా అవినీతి జరిగి ఉంటే ఇంతవరకు ఎందుకు చార్జిషీటు దాఖలు  చేయలేదని ప్రశ్నించారు. డిజైన్ టెక్ సంస్థ అకౌంట్ లు ప్రీజ్ చేసి నిధులు స్తంభింభచేసినపుడు కోర్టు మీకు చివాట్లు పెట్టి ఆ డబ్బు నేరానికి సంబంధించింది కాదని చెప్పిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.  2.13 లక్షల మంది విద్యార్థులకు  శిక్షణ ఇచ్చి,  72 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారని, దీనిని కుంభకోణం అని ఏ విధంగా అంటారని స్వయంగా హై కోర్టు చెప్పలేదా? అని అడిగారు.   మళ్లీ తప్పుల  మీద తప్పులు  చేసి కోర్టుల చేత ఎందుకు తిట్లు తింటారని ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని అన్నారు.  ఎలాంటి అవినీతి లేని కేసులో రాజకీయ కుట్రతోనే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారని అన్నారు.  ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదని,  దీనిపై న్యాయపోరాటం చేస్తామని, ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని బాలకృష్ణ చెప్పారు.