జగన్ పాలనపై కురుక్షేత్ర యుద్ధం

జగన్ పాలనపై కురుక్షేత్ర యుద్ధం

మహానాడు సభలో చంద్రబాబు శంఖారావం 

రాజమహేంద్రవరం, మే 28: జగన్ పాలనపై కురుక్షేత్ర యుద్ధం ప్రకటిస్తున్నామని, రేపు జరిగేది కురుక్షేత్ర యుద్ధమని టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు  అన్నారు. నన్నయ్య నడయాడిన రాజమహేంద్రవరం నుంచి శంఖారావం పూరిస్తున్నా మన్నారు.  అన్ని రంగాలు దెబ్బతిని, అన్ని వర్గాల పరిస్థితి  దయనీయంగా మారిన నేపథ్యంలో  ఏపీ ని కాపాడుకోవడానికి ముందుంటామని ఆయన అన్నారు.

రాజమహేంద్రవరం వేమగిరిలో టీడీపీ ‘మహానాడు’  రెండో రోజు  ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని  ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. మహాశక్తి, యువగళం, అన్నదాత, బిసిల రక్షణ చట్టం, ఇంటింటికి నీరు, పూర్ టు రిచ్ పథకాలను ఆయుధాలుగా ఇచ్చానని వీటిని ఇంటింటికి ప్రచారం చేయాలని ఆయన సూచించారు. తల్లికి వందనం పేరిట ప్రతి బిడ్డా చదువుకునేందుకు ఏటా రూ 15,000/- ఇస్తామని, ఇంట్లో ఎంతమంది చదుకునేవాళ్ళు ఉంటె అంతమందికీ ఇష్టమన్నారు. 

మమ్మల్ని అడ్డుకోవాలని చూస్తే తొక్కుకుంటూ వెళ్తామని హెచ్చరించారు. ఇంతవరకు తన మంచితనాన్నే చూశారని, రాజకీయ రౌడీలకు శిక్ష వేసే బాధ్యత తనదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీని దెబ్బతీయాలని చూసినవారే దెబ్బతిన్నారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ సామాన్య కుటుంబంలో పుట్టి ఎంతో కష్టపడి పైకి ఎదిగారని చంద్రబాబు గుర్తుచేశారు.

తెలుగువారి రుణం తీర్చుకోవడానికే పార్టీ పెట్టారని చెప్పారు. అందుకే క్రీస్తుశకం లాగే.. ఎన్టీఆర్ శకం అని చెప్పుకోవాలన్నారు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్‌దని గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తిగా అనేక సంస్కరణలతో ముందుకు వచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. పైనుంచి దేవుడు కూడా ఆశీర్వదించడంతో వర్షం పడిందని  ఆయన అన్నారు.