ఈటలను గెలిపించుకుందాం

ఈటలను గెలిపించుకుందాం

ముద్ర,జమ్మికుంట: మాదిగ కులస్తులు ఏ పార్టీలో ఉన్న ఈటల రాజేందర్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట గాంధీ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగులో మందకృష్ణ మాదిగ మాట్లాడారు. గడచిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ, కొత్త కొత్త పథకాలు పెట్టిన ఇక్కడి ప్రజలు వినూత్న రీతిలో తీర్పునిచ్చి ఈటల రాజేందర్ ను గెలిపించి ప్రపంచానికి చాటి చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు బీసీ సీఎం కాలేదని, ఆ అవకాశాన్ని నరేంద్ర మోడీ కల్పించారని, 50 శాతానికి పైగా ఉన్న బీసీలంతా ఏకమై బీసీ సీఎం చేసేందుకు కృషి చేయాలని చెప్పుకొచ్చారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వర్గీకరణ చేయలేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం లేక కూడా రాయలేదని, అలాంటి పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదని ప్రజలను ఉద్దేశించి చెప్పారు. అనంతరం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడారు. కమలాపూర్ మండల కేంద్రంలో తనకు ఓటు వేసి గెలిపించకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని బ్లాక్ మెయిల్ చేసే చిల్లర రాజకీయాలకు హుజరాబాద్ ప్రాంతం వేదికగా మారిందని దుయపట్టారు.

నిజాం చక్రవర్తి పరిపాలన ఎలా చేశాడో తెలియదు కానీ, ఈ నిజాం సర్కార్ (కేసీఆర్) హుజురాబాద్ లో మాత్రం ఓ సైకోను, శాడిస్టును ఏర్పాటు చేసి తన కొడుకులాంటివాడని సభలో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒక్క హుజురాబాద్ లో గెలిస్తేనే మీ బిడ్డ పెద్దోడు కాదని, తెలంగాణ గడ్డమీద కేసీఆర్ ను బొంద పెడితేనే ఈ బిడ్డ పెద్దోడు అవుతాడని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని, మనిషికి మనిషి గౌరవించే ఒక గొప్ప తెలంగాణ కావాలని తాను కోరుకుంటున్నానని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.