భూపాలపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటన..

భూపాలపల్లిలో మంత్రి కేటీఆర్ పర్యటన..
  • పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో సోమవారం రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సుడిగాలి పర్యటన చేశారు. మంత్రి కేటీఆర్ ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భూపాలపల్లికి చేరుకున్న మంత్రి కేటీఆర్ జిల్లాకేంద్రంలో 15 ఎకరాల స్థలంలో రూ.59 కోట్ల45 లక్షల వ్యయంతో నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానoతో రూ. 25.90  కోట్ల వ్యయంతో, 37 ఏకరాల స్థలంలో నిర్మించిన జిల్లా  పోలీసు కార్యాలయాన్ని, డబుల్ బెడ్ రూం ఇండ్లను, పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ప్రారంభించారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టిన ఈ జిల్లాలో కలెక్టర్ కార్యాలయంను ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

వేరే రాష్ట్రాల కంటీ గొప్పగా స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. తొమ్మిదిన్నర సంవత్సరాలలో తెలంగాణలో సాధించిన ప్రగతి, సమగ్ర సమతుల్యతతో అభివృద్ధి, సంక్షేమం చేయడం జరుగుతుందని, దేశంలోని ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో జరిగిందన్నారు.దేశంలో 4వ స్థానంలో తెలంగాణ నిలిచిందని, ఫర్ క్యాపిటల్ ఇన్కంలో 1వ స్థానంలో తెలంగాణ ఉందని,ఐటీ, వ్యవసాయ ఉత్పత్తుల లో తెలంగాణ అగ్రగామిగా ఉందని,పరిశ్రమలు నెలకొల్పడం, పర్యావరణ పరిరక్షణలో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఒకవైపు అభివృద్ధి, మరో వైపు సంక్షేమంతో ముందుకు వెళుతున్నామని, దేశంలో ఎప్పుడు అవార్డులు వచ్చిన తెలంగాణ మొదటి 10స్థానాల్లో ఉంటుందని,2014లో ఏ పరిస్థితి ఉండేది, ఇప్పుడు ఏ పరిస్థితి ఉందనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని, ఈ రోజు వరకు జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బండా ప్రకాశ్, ఎంపి దయాకర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, జడ్పీ చైర్మన్లు జక్కు శ్రీ హర్షిణీ, గండ్ర జ్యోతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.