ధాన్యం కొనుగోలులో బిల్లుల చెల్లింపులు సత్వరమే జరగాలి

ధాన్యం కొనుగోలులో బిల్లుల చెల్లింపులు సత్వరమే జరగాలి

 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సి.ఎస్ సమీక్ష 

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించిన బిల్లులను సత్వరమే చెల్లించేందుకు చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమం, కంటి వెలుగు శిబిరాలను విరివిగా సందర్శిస్తూ, క్షేత్రస్థాయిలో మరింత సమర్ధవంతంగా అమలు జరిగేలా చూడాలన్నారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అంశాలపై సి.ఎస్ సమీక్ష నిర్వహించారు. డబుల్ బెడ్ రూమ్ పథకంతో పాటు కంటి వెలుగు, ఆరోగ్య మహిళా, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఎరువుల నిల్వలను సమకూర్చుకోవడం, జీ.ఓ నెం.లు 58 , 59 , 76, 118 అమలు, ఆయిల్ పామ్ లక్ష్య సాధన,  ఎంసెట్ అంశాల ప్రగతిని సమీక్షిస్తూ సూచనలు చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించి,  బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో బిల్లులు జమ చేసే విషయంలో జాప్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ఎర్రపాడు, బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరాలకు మహిళలు వచ్చే విధంగా గ్రామ సంఘాల సమావేశంలో ఐకెపి అధికారులు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు.  రైస్ మిల్లులకు సీ ఎం ఆర్ కింద కేటాయించిన ధాన్యాన్ని నిర్దిష్ట గడువులోగా మిల్లింగ్ జరిపి పౌర సరఫరాల శాఖకు బియ్యం నిల్వలు చేరవేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

కంటి వెలుగు, ఆరోగ్య మహిళా కార్యక్రమాలకు అపూర్వ స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే కంటి వెలుగు కార్యక్రమం 69 రోజులు పూర్తి చేసుకుందని, ఇదే తరహాలో మిగిలిన 31 రోజుల పాటు శిబిరాలను పకడ్బందీగా నిర్వహిస్తూ లక్ష్య సాధనకు కృషి చేస్తామన్నారు. ఆసుపత్రులను క్రమం తప్పకుండా సందర్శిస్తూ అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నమన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఏవో రవీందర్, ఆర్డీవో శీను, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.