Preeti Murder Case సైఫ్ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
డాక్టర్ ప్రీతి మృతి కేసులో సైఫ్ ను పోలీసులు కస్టడీ లోకి తీసుకున్నారు. ఖమ్మం జైలు నుంచి వరంగల్ కు తీసుకువచ్చారు. సైఫ్ను నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. సైఫ్ను వరంగల్ మట్టెవాడ పోలీస్స్టేషన్లో ఉంచి పోలీసులు విచారిస్తున్నారు. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి ప్రీతి కుటుంబ సభ్యులు కీలకమైన ఆరోపణలు చేశారు. కేసుకు సంబంధించి సరైన విచారణ జరగడం లేదని ముందు నుంచి చెబుతున్నారు.
ఆరోపణలు ఎదుర్కుంటున్న పోలీసులే విచారణ అధికారులుగా ఎలా ఉంటారని ప్రీతి తండ్రి ప్రశ్నిస్తున్నారు. ప్రీతిని సైఫ్ వేధిస్తున్నారంటూ మొదట ఏసీపీ బోనాల కిషన్కు ప్రీతి తండ్రి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ పట్టించుకోకపోవడంతో రెండు రోజుల తర్వాత ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని ప్రీతి కుటుంబసభ్యులు ఆరోపించారు. మరోవైపు ఆరోపణలు ఎదుర్కుంటున్న పోలీసు అధికారులే విచారణ జరపడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.