పోలింగ్ సర్వం సిద్ధం
- కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ
- జిల్లా ఎన్నికల అధికారి సిహెచ్.శివలింగయ్య
ముద్ర ప్రతినిధి, జనగామ : జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో జరిగే పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య తెలిపారు. జిల్లాలోని జనగామ, స్టేషన్ఘన్పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి బుధవారం జరుగుతున్న పనులను, రిటర్నింగ్ అధికారి కార్యాలయాలు, పంపిణీ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ప్రతి క్షణం అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ పర్యవేక్షిస్తారని కలెక్టర్ తెలిపారు. ఆయన వెంట జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు రోహిత్ సింగ్, మురళీ కృష్ణ, రాంమూర్తి, ఎన్నికల విభాగం సిబ్బంది ఉన్నారు.