పోంజీ కుంభకోణం..
- గోవిందాను ప్రశ్నించనున్న ఈఓడబ్ల్యూ
ముంబై: దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఆన్లైన్ పోంజీ కుంభకోణం దర్యాప్తుకు సంబంధించి బాలీవుడ్ స్టార్ నటుడు గోవిందాను ప్రశ్నించనున్నట్లు ఒడిశా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఓ ప్రకటనలో తెలిపింది. పాన్ -ఇండియా స్కామ్లో దోషిగా తేలిన కంపెనీకి సంబంధించిన ప్రకటనలో నటుడు గోవింద్ నటించినందుకు విచారించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాపారం సాగిస్తోన్న సోలార్ టెక్నో అలయన్స్ అనే కంపెనీ క్రిప్టోకరెన్సీ పెట్టుబడి పేరుతో ఆన్లైన్ పోంజీ స్కీంను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా కస్టమర్ల నుంచి ఈ కంపెనీ భారీ మొత్తంలో డిపాజిట్లను సేకరించింది. ఇలా దాదాపు రూ. 1,000 కోట్లు సమీకరించినట్లు సమాచారం. ఈ ఆన్లైన్ పోంజీ స్కామ్లో బాలీవుడ్ నటుడు గోవిందా పేరు తెరపైకి రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ కంపెనీకి సంబంధించి కొన్ని ప్రచార కార్యక్రమాలు నిర్వహించినందుకు గానూ గోవిందాను ఈఓడబ్ల్యూ ప్రశ్నించనుంది. ఐతే ఈ కుంభకోణంలో నటుడు గోవిందా ప్రస్తుతానికి అనుమానితుడు మాత్రమేనని, నిందితుడుకాదని స్పష్టం చేసింది.