అత్యవసర విభాగాల అధికారులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం: కలెక్టర్
ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: అత్యవసర సేవల పరిధిలోకి వచ్చే వివిధ విభాగాలకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలట్ సౌకర్యం కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎయిర్ పోర్ట్, రైల్వే, భారత ఆహార సంస్థ , ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో , దూరదర్శన్, అల్ ఇండియా రేడియో, విద్యుత్ శాఖ, వైద్య , కుటుంబ సంక్షేమం, రవాణ, పౌర సరఫరాలు, , బిఎస్ యెన్ ఎల్ , మీడియా , అగ్నిమాపక విభాగాలలో విధులలో నిమగ్నమై ఓటు హక్కును వినియోగించుకోలేని వారు మాత్రమే దరఖాస్తులను ఫారం -12 (డి) లో తమ పూర్తీ వివరాలతో సంబంధిత రిటర్నింగ్ అధికారులకు నవంబర్ 3 నుండి 7 లోగా సమర్పించాలని ఆయన సూచించారు. దరఖాస్తు ఫారాలను రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారుల నుంచి పొందవచ్చని, ఎన్నికల సంఘం పోర్టల్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని అయన తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణ అనంతరము రిటర్నింగ్ అధికారులు absentee list లను తయారు చేస్తారని, దరఖాస్తులోని వివరాలను ఎలక్టోరల్ రోల్ లోని వివరాలతో సరిపోల్చిన పిదప అర్హత గల ఓటర్ల లిస్టులను తయారు చేసి వారికి పోస్టల్ బ్యాలట్ పత్రాలను అందచేస్తారని అన్నారు . తదుపరి వారు రిటర్నింగ్ అధికారి కార్యాలములో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోస్టల్ వోటింగ్ సెంటర్ (పివిసి) లలో ఓటు వేయవలసి ఉంటుందన్నారు. ఓటింగ్ కేంద్రాలు, సమయ వివరాలు దరఖాస్తులలోని మొబైల్ నెంబర్లకు లేదా బూత్ లెవెల్ అధికారుల ద్వారా తెలియజేస్తామన్నారు. . ఈ సదుపాయం కొరకు దరఖాస్తు చేసుకున్న వారు పోలింగ్ బూతులతో ఓటు అవకాశం ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని వారు మాత్రమే ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటే బాగుంటుందని కలెక్టర్ సూచించారు. పోస్టల్ బాలట్ ప్రక్రియ పోలింగ్ తేదీకి ముందు మూడు రోజులలో పూర్తీ చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రములో ఒక నోడల్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారితో పాటు గజిటెడ్ అధికారిని నియమిస్తున్నామని కలెక్టర్ వివరించారు.