చల్లని కబురు..!
- మరో రెండు రోజుల్లో రాష్ట్రంలో వర్షాలు
- వాతావరణ విభాగం అంచనా
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు వినిపించింది. మార్చి నెల సగం గడవక ముందే భగ్గు మంటోన్న భానుడి ప్రతాపంతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతోన్న క్రమంలో ఈ నెల 17 నుంచి 19 వరకు మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.హైదరాబాద్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందనీ, మార్చి 18 వరకు ఉదయం వేళల్లో నగరంలో పొగమంచు వాతావరణం ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, శుక్రవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో 41డిగ్రీల సెల్సియస్కు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లాలో అత్యధికంగా 40.9 డిగ్రీలు, హైదరాబాద్లో గరిష్టంగా 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.