ఇంటలిజెన్స్​ హెచ్చరికల నేపథ్యంలో బీజేపీ నేతలకు భద్రత పెంపు

ఇంటలిజెన్స్​ హెచ్చరికల నేపథ్యంలో బీజేపీ నేతలకు భద్రత పెంపు

బస్తర్​: చత్తీస్‌గఢ్‌లో రెండు విడతల్లో జరగనున్న ఎన్నికలపై ఇంటలిజెన్స్​ హెచ్చరికలు దడ పుట్టిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నేతలపై మావోయిస్టులు గురి పెట్టనున్నారన్న విషయాన్ని పసిగట్టి అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం నుంచి 24 మంది బీజేపీ నేతలకు ఎక్స్​ కేటగిరీ భద్రతను కేటాయించారు. ఈ నాయకులతో ఇద్దరు సాయుధ కమాండోలను ఉంటారు. ఎన్నికల ప్రచారంలో ఎల్లప్పుడూ వారితో ఉంటారు. ఈ బీజేపీ నాయకుల్లో ఇంతకుముందు చాలాసార్లు నక్సలైట్ల దాడికి గురైన కొందరు నేతలు ఉండడం విశేషం. దీంతో వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారికి ఎక్స్ కేటగిరీ భద్రతను కల్పించారు. దంతెవాడ జిల్లాలో 10 మంది బీజేపీ నాయకులకు గరిష్ట భద్రత కల్పించారు. ఈ భద్రత డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంటుంది.

బస్తర్ డివిజన్‌లో అంతర్గత ప్రాంతాల్లో బీజేపీ నేతలను నక్సలైట్లు ఎక్కువగా టార్గెట్ చేసుకున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో నారాయణపూర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిని హత్య చేశారు. ఆ తర్వాత నారాయణపూర్‌లోనే మాజీ సర్పంచ్‌ను హత్య చేశారు. బీజాపూర్‌లో కూడా నక్సలైట్ల చేతిలో బీజేపీ సర్పంచ్ హత్యకు గురయ్యాడు. ఇది కాకుండా దంతేవాడ, బస్తర్ జిల్లాల్లో నక్సలైట్ల చేతిలో పలువురు బీజేపీ నేతలను హతమార్చారు. దీంతో భద్రత పెంచాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.జగదల్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థులు కిరణ్ దేవ్, కమలా వినయ్ నాగ్, మనీష్ సురానా, సంతోష్ గుప్తా, ధీరేంద్ర ప్రతాప్ సింగ్, సోమదు కొర్రమ్, కుల్దీప్ ఠాకూర్, సత్యజిత్ సింగ్, కామో కుంజమ్, శ్రీనివాస్ ముదలియార్, కమలేష్ మాండవి, లవ్ కుమార్ రాయుడు, ఫూల్‌చంద్ గగ్డా, సుధీర్ గగ్డా ధనిరామ్.బర్సే, సంజయ్ సోధి, జస్కేతు ఉసెండి, దేవ్‌లాల్ దుగ్గ, భరత్ మతియార్‌లకు ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించారు.