గొర్రెల కేసు ఏసీబీకి
- గొర్రెల పంపిణీలో అక్రమాలు
- పథకం ప్రారంభమైనప్పటి నుంచి విచారణ
- ఆదేశించిన సర్కారు
- బినామీ ఖాతాల్లోకి రూ.2.08 కోట్లు మళ్లింపు
- కీలక అధికారుల మెడకు చుట్టుకునే అవకాశం
- తలసానికి ఏసీబీ నోటీసులు..?
ముద్ర, తెలంగాణ బ్యూరో : గత ప్రభుత్వ హయాంలో పశుసంవర్థక శాఖ కేసులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన కేసులు ఏసీబీకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గొర్రెల పంపిణీ వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి పశసంవర్థక శాఖపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అలాగే పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపైనా కేసు ఫైల్ అయ్యింది. ఈ రెండు కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి గచ్చిబౌలిలో ఇప్పటికే అధికారులపై కేసు నమోదు అయ్యింది. నాంపల్లిలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయం కేసులో ప్రభుత్వం బిగ్షాక్ ఇచ్చింది. పశుసంవర్ధక శాఖ కేసులను రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి బదిలీ చేసింది. ఫైల్స్ మాయం, నిధుల స్వాహా కేసులను ఏసీబీకి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఇప్పటికే పలువురిపై అక్రమాలపై కేసులు నమోదయ్యాయి. నకిలీ బ్యాంక్ ఖాతాలు తెరిచి మొత్తం రూ.2 కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారనే అభియోగాలు అధికారులపై నమోదయ్యాయి.. అయితే ఇదే కేసులో ఇటీవల గచ్చిబౌలి పోలీసులు నలుగురిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును ఏసీబీకి బదిలీ చేశారు.
ఫైళ్లు ఎలా మాయమయ్యాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు కాగానే పలుచోట్ల ఫైళ్లు మాయం దగ్ధం కావడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ మాసబ్ ట్యాంక్ లోని పశు సంవర్ధక శాఖ ఆఫీసులోకి అక్రమంగా ప్రవేశించి, సిబ్బంది సహాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను చింపివేసి, కొన్ని ముఖ్యమైన ఫైల్స్ను తన కారులో తీసుకెళ్లాడు. ఈమేరకు వాచ్మెన్ మందాల లక్ష్మయ్య ఫిర్యాదుతో పోలీసులు కల్యాణ్, ఆపరేటర్ మోహన్ ఎలిజ, వెంకటేశ్, ప్రశాంత్లపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే గొర్రెల పంపిణీ పథకం అక్రమాలను ప్రభుత్వం గుర్తించింది. బినామీ పేర్లతో ఖాతాలు తెరిచి రూ.2.08 కోట్ల నిధుల దారి మళ్లింపు, పశుసంవర్థక భవన్లో ఫైళ్లు మాయమైన ఉదంతాలపై పోలీసులు కొంత విచారణ జరిపారు. నిధుల మళ్లింపు వ్యవహారంలో నలుగురు అధికారులు, ఇద్దరు గొర్రెల దళారులపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇప్పటికే పోలీసులు కొంతమేర దర్యాప్తు చేపట్టినా మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పశుసంవర్థక శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు కుమ్మక్కై నిధులను దారి మళ్లించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. దీనిలో రాష్ట్ర పశుసంవర్థక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్న రవికుమార్, ఆదిత్య కేశవ్సాయి, రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఇద్దరు అధికారులు, కాంట్రాక్టర్లు, దళారులు కలిసి గతేడాది ఆగస్టు 13 నుంచి 23 మధ్యకాలంలో ఏపీలో పర్యటించారు. 18 మంది రైతుల నుంచి 133 యూనిట్లు (2,793 గొర్రెలు) సేకరించారు. వాస్తవానికి గొర్రెలు విక్రయించిన ఏపీ రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేయాల్సి ఉంది. కానీ అలా చేయకుండా దళారులకు చెందిన బినామీ ఖాతాల్లోకి రూ.2.08 కోట్లు మళ్లించారు. డబ్బులు రాకపోవటంతో ఏపీ రైతులు కాంట్రాక్టర్ను నిలదీశారు. పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్లో ఆరా తీయగా డబ్బుల చెల్లింపు పూర్తయినట్లు అధికారులు ధ్రువీకరించారు.
దీంతో కాంట్రాక్టర్ వెళ్లి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పశుసంవర్థక శాఖ ఏడీలు రవికుమార్, ఆదిత్య కేశవ్ సాయితోపాటు ఇద్దరు దళారులపై ఐపీసీ సెక్షన్లు- 406, 409, 420 ప్రకారం గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కల్యాణ్ కుమార్ మసాబ్ ట్యాంక్లోని రాష్ట్ర పశుసంవర్థకశాఖ కార్యాలయానికి వెళ్లి కీలక ఫైళ్లను చించేసి, కాగితపు ముక్కలను బస్తాలో మూటగట్టుకొని తన కారులో వేసుకొని వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇలా రాష్ట్రంలోని గొల్ల-కురుమలకు రూ.75 వేలు చేతిలో పెట్టి యూనిట్లు కాజేసిన సంఘటనలు, గొర్రెలతో లబ్ధిదారుల ఫొటోలు తీయించి, వాహనాల్లో తీసుకెళ్లి, రైతులతో ఒప్పందం చేసుకొని, మళ్లీ అవే వాహనాల్లో తిరిగి జీవాలను తీసుకెళ్లిన ఉదంతాలు కోకొల్లలుగా జరిగాయని ఇప్పటికే తేలింది. 20 గొర్రెలు, ఒక పొట్టేలుకు బదులుగా చిన్నవి, నాణ్యత లేని, రోగాల బారిన పడిన జీవాలను కూడా రైతులకు అంటగట్టారు. గొర్రెల రీ-సైక్లింగ్ అక్రమ రవాణాపై అప్పట్లో కేసులు కూడా నమోదయ్యాయి. రాష్ట్ర పశుసంవర్థక శాఖకు చెందిన 24 మంది అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఏసీబీ విచారణలో ఇవన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
గొర్రెల పంపిణీ స్కాం మాజీ మంత్రి తలసాని మెడకు చుట్టుకునే పరిస్థితి మారింది. ఫైళ్లు మాయం చేసిన ఘటనలో తలసాని ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులకు లింకులు ఉన్నట్లు తేలుతుండటంతో.. కేసును ఏసీబీకి బదిలీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అధికారులపై విచారణ తర్వాత మాజీ మంత్రి ప్రమేయంపైనా ఏసీబీ అధికారులు విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. గొర్రెల పంపిణీ అక్రమాలపై ఏసీబీ ఆల్రెడీ విచారణ మొదలుపెట్టినట్లు తెలుస్తున్నది. దీనిలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. త్వరలోనే మాజీ మంత్రి తలసానిని విచారించే అవకాశాలున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి.