నర్సాపూర్ లో బిఆర్ఎస్ కు షాక్

నర్సాపూర్ లో బిఆర్ఎస్ కు షాక్
  • కాంగ్రెస్ లో చేరిన ముఖ్యనేతలు

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలింది. ఢిల్లీలో తెలంగాణ పార్టీ ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే, టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ గాలి అనిల్ కుమార్ సమక్షంలో దివంగత మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కోడలు బిఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి, ఆమె కుమారుడు చిలిపిచెడు మండల మాజీ జెడ్పిటిసి శేష సాయి రెడ్డిలు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే కౌడిపల్లి మండల టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు చంద్రం కృష్ణ గౌడ్, సుదీర్ రెడ్డిలు సైతం కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థిగా సునీతా రెడ్డిని ప్రకటించిన మరుసటి రోజే సుహాసిని రెడ్డి, ఆమె కుమారుడు శేష సాయి రెడ్డిలు కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కుటుంబానికి చెందిన వీరు పార్టీ మారడంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి.