జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలవండి: ఎంపీ నామ లేఖ

జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలవండి: ఎంపీ నామ లేఖ
mp nama nageswar rao Anurag Singh Thakur

 ఖమ్మం, ముద్ర: ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి విజృంభణతో, విధి నిర్వహణలో భాగంగా తమ ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయ కుటుంబాల పట్ల కేంద్ర ప్రభుత్వం మానవీయంగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బి.ఆర్.ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర రావు కోరారు. ఈ మేరకు ఇటీవల ఆయన కేంద్ర సమాచార, ప్రసారాల శాఖా మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కి లేఖ రాయగా మంత్రి నుంచి సానుకూలంగా స్పందన లభించింది. నియమ నిబంధనలతో అర్హులైన జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వ పథకాల ద్వారా ఆదుకోవాలని నామా గుర్తు చేశారు. 

అందులో భాగంగా ఖమ్మం నగరానికి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు సత్వరమే జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీమ్ ( జెడబ్ల్యుఎస్) కింద ఆర్ధిక సాయం మంజూరు చేసి, వారి కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని నామ తన లేఖలో ఉద్ఘాటించారు. ఖమ్మం నగరంలోని జర్నలిస్టులు కాశం వెంకన్న, బైరు కరంచంద్ గాంధీ మృతితో ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని నామ వివరించారు. ఇరు కుటుంబాల వారు తనను కలిసి, తమ పరిస్థితిని వివరించారని చెప్పారు. సంబంధిత జర్నలిస్టుల విషయమై కేంద్ర మంత్రి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి, వారి కుటుంబ సభ్యులకు ఆర్ధిక సాయం అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ నామ కోరిన తర్వాత నేడు కేంద్ర మంత్రి పరిశీలించి త్వరితగతిన మంజూరు చేస్తామని ఎంపీ నామకు లేఖ రాశారు.