మహిళల ఆధ్వర్యంలో క్యాంటీన్ల ఏర్పాటు
![మహిళల ఆధ్వర్యంలో క్యాంటీన్ల ఏర్పాటు](https://mudranews.in/uploads/images/2024/06/image_750x_666bd91b6c09d.jpg)
- పర్యాటక ప్రాంతాలు, బస్సుస్టాండ్లు, కలెక్టరేట్లు తదితర ప్రాంతాల్లో ఏర్పాటు
- మహిళా సంఘాల బలోపేతమే లక్ష్యం
- గ్రామైక్య సంఘాల సారథ్యం
ముద్ర, తెలంగాణ వార్తలు: తెలంగాణ రాష్ట్రంలోని అక్కాచెల్లెమ్మలకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలో 'మహిళా శక్తి - క్యాంటీన్ సర్వీస్' ల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలో 'మహిళా శక్తి - క్యాంటీన్ సర్వీస్ ' లను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అన్ని ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్ స్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాలలో మహిళా సంఘాల నిర్వహణలో ప్రత్యేకంగా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఇప్పటికే, అన్న క్యాంటీన్ల పేరుతో కేరళలో, దీదీ కా రసోయ్ అనే పేరుతో బెంగాల్లో నడుస్తున్న క్యాంటీన్ల పనితీరుపై అధ్యయనం చేసినట్లు వివరించారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఈ క్యాంటీన్ల నిర్వహణను గ్రామైక్య సంఘాలకు అప్పగించనున్నట్టు తెలిపారు. క్యాంటీన్ నిర్వహణపై సంఘాలకు ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తామని తెలిపారు. క్యాంటీన్ల పనితీరు, నిర్వహణ, వీటి ఏర్పాటుకు ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం, వీటి ఏర్పాటుకు రోడ్ మ్యాప్ తదితర అంశాలపై సవివరంగా ప్రణాళికను రూపొందించాల్సింగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ ను ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. క్యాంటీన్ సేవల ఏర్పాటుపై రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనిత రామచంద్రన్, ఆరోగ్య శాఖ కమీషనర్ కర్ణన్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు, టూరిజం శాఖ డైరెక్టర్ నిఖిల, టూరిజం కార్పొరేషన్ ఎండీ రమేష్ నాయుడు, తదితరులు హాజరయ్యారు.