కాంగ్రెస్ బోణి...!
- అశ్వారావుపేట, ఇల్లందులో కాంగ్రెస్ గెలుపు
- ఆరు మంత్రులు వెనకంజ
- హుజూరాబాద్లో మూడో స్ధానంలో ఈటల
- కామారెడ్డిలో కేసీఆర్ ఎదురీత
- యాకుత్పురలో బీజేపీ లీడ్
ముద్ర, తెలంగాణ ముద్ర : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బోణి కొట్టింది. అశ్వారావుపేట నుంచి పోటీ చేసిన ఆదినారాయణ రావు సమీప బీఆర్ఎస్ అభ్యర్ధి, సిట్టింగ్ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావుపై 23,358 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇల్లందు నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్ధి కోరం కనుకయ్య సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్పై 18వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ 63 సెగ్మెంట్లలో ముందంజలో ఉండగా, బీఆర్ఎస్ 40, బీజేపీ పది, ఎంఐఎం నాలుగు స్ధానాల్లో లీడ్ లో ఉంది. కాగా యాకుత్పురలో బీజేపీ అభ్యర్ధి వీరేందర్ యాదవ్ ముందంజలో ఉన్నారు. వీరితో పాటు ఆరు మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి వెనుకంజలో ఉన్నారు. పాలేరు బీఆర్ఎస్ అభ్యర్ధి కందాల ఉపేందర్రెడ్డి, భూపాలపల్లి అభ్యర్ధి గండ్ర వెంకటరమణా రెడ్డి, వర్ధన్నపేట అభ్యర్ధి ఆరూరి రమేశ్ కౌంటింగ్ మద్యలోనే కేంద్రాల నుంచి వెనుదిరిగారు.