హత్యాహత్నం కేసులో ఇద్దరి అరెస్టు ....
ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: అక్రమ సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను కరెంటు షాక్ తో హ త్యాయత్నం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని సిరిసిల్ల రూరల్ సిఐ ఉపేందర్ తెలిపారు. మంగళవారం సిరిసిల్ల రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ ఉపేందర్ వివరాలు వెల్లడించారు. సీఐ ఉపేందర్ తెలిపిన వివరాల ప్రకారం తంగళ్ళపల్లి మండలం ఇంద్రనగర్ గ్రామంలోని భరత్ నగర్ కాలనీకి చెందిన చిట్యాల శైలజ ,బాలకృష్ణ ఇద్దరు భార్యాభర్తలు, వీరికి ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరగగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
శైలజ కు అదే గ్రామానికి చెందిన వరసకు మరిది అయిన చిట్యాల శ్రీకాంత్ అనే వ్యక్తి తో పరిచయం ఏర్పడి, అది కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది . వీరు తరచుగా ఫోన్ మాట్లాడుతుండగా భర్త బాలకృష్ణ అడ్డు చెప్పగా, వీరి అక్రమ సంబంధానికి భర్త అడ్డగున్నాడని , ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవడానికి, సోమవారం రోజున శైలజ , శ్రీకాంత్ లు కలసి బాలకృష్ణ పొలం వద్ద కరెంట్ షాక్ తో హత్య చేయడానికి నిర్ణయించుకున్నారు.కరెంటు వైర్ల తో షాక్ వచ్చి చనిపోయే విధంగా ఏర్పాట్లు చేయడంతో అట్టి ప్రమాదం నుండి బాలకృష్ణ తృటిలో తప్పించుకొని ప్రాణాపాయం నుండి బయటపడడంతో శైలజ , శ్రీకాంత్ లు భయపడి ఇంటి నుండి పారిపోయారు. బాధితుడు బాలకృష్ణ తంగాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా హత్యహత్నం కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మంగళవారం ఉదయం వరంగల్ లో నిందితులైన శైలజ, శ్రీకాంత్ లను అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచి ,రిమాండ్ కి పంపించామని తెలిపారు.